మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ABN , Publish Date - Feb 07 , 2025 | 02:24 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా మం డల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలనే అభిప్రాయం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా మం డల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలనే అభిప్రాయం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ, ఇతర సమావేశా ల్లోనూ అందరు ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ పని తీరుకు పరిషత్ ఎన్నికలు కొలమానంగా నిలుస్తాయని నాయకులు భావిస్తున్నారు. గురువారం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశం లో మెజారిటీ శాసనసభ్యులు పార్టీ సింబల్తో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలనే ముందుగా నిర్వహిం చాలని, ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం ఏ ఎన్నికలు ముందుగా జరుగుతాయనే విషయమై స్పష్టత ఇవ్వలేదు.
గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తుండగా, మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు, పెరిగిన ఓటర్లను బట్టి ఆయా మండలాల్లో ఎంపీటీసీ స్థానాల సవరణ పూర్తి కావ చ్చింది. అయితే గత ఎన్నికల కంటే జిల్లాలో ఒక ఎంపీ టీసీ స్థానం జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండల పరిధిలోకి వెళ్లగా, గతంలో ఎన్నికలు కాకుండా ఉన్న కుందనపల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి ఎంపీటీసీ స్థానాలకు ఈసారి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలో 13 మండల పరిషత్ల్లోని 140 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రజల్లోకి సంక్షేమ పథకాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే అమలయ్యాయి. ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకపోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వం సూచిస్తున్నది. ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ కాగా, రైతు భరోసా పథకం ఆరంభం అయ్యింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, రూ.500లకే సబ్సిడీ వంట గ్యాస్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సదుపా యం కల్పించారు. గత నెల 26న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ఆరంభించారు. రైతుభరోసా పథకం ద్వారా బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఈ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకవెళ్లని కారణంగా రావాల్సిన మైలేజీ రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అలాగే ఏ రాష్ట్రం చేయని విధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నది. వీటిని ప్రజల్లోకి తీసుకవెళ్లిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నది.
కొలిక్కి వచ్చిన రిజర్వేషన్ల అంశం..
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభు త్వం చేపట్టిన కుల గణన సర్వే కారణంగా బీసీ రిజ ర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయ కులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాజ్యాంగబద్ధంగా కాకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రిజర్వేషన్లపై నెలకొన్న సందిగ్ధతకు కొంత తెరపడినట్లయ్యింది. రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు కల్పించడం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం కావడంతో ముందుగా పంచాయతీ ఎన్నికల కంటే పార్టీ సింబల్తో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తే ప్రభుత్వ పని తీరు పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా తెలియనున్నదని పార్టీ నాయకులు అంటున్నారు. అనుకూల ఫలితాలు వస్తే మిగతా ఎన్నికల్లో పార్టీ పరంగా విజయం సాధించడం నల్లేరుపై నడకేనని పార్టీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం కూడా ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నట్లు కనబడుతోంది.