క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం సాధ్యమా?:ఎంపీ ఈటల
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:58 AM
క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యమవుతుందా అని బీజేపీ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సీఎం రేవంత్ను ప్రశ్నించారు.

హైదరాబాద్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యమవుతుందా అని బీజేపీ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సీఎం రేవంత్ను ప్రశ్నించారు. నాటి క్యాబినెట్లో పనిచేసిన ముగ్గురు ఇప్పుడు సీఎం రేవంత్ వద్ద ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 96 క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఒక్కదాంట్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులపై చర్చ జరగలేదంటూ సీఎం చేసిన ప్రకటనపై ఈటల స్పందించారు.
వివిధ శాఖల్లో తీసుకునే నిర్ణయాలను క్యాబినెట్ ముందుంచాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించేవారని గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు నాటి సీఎం కేసీఆర్ రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని చెప్పారు. ప్రాజెక్టులో అవినీతి జరిగితే విచారణ జరగాల్సిందే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అమలు చేసే దమ్ముందా అని సీఎం రేవంత్కు ఈటల సవాల్ విసిరారు.