Tummala Nageswara Rao: ఫలించిన తుమ్మల భగీరథ యత్నం
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:14 AM
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించాలన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
వైరా రిజర్వాయర్కు గోదారి జలాలు
నిమ్మ వాగు ద్వారా నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
ఖమ్మం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించాలన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. భగీరథ ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) లెఫ్ట్ కెనాల్ ద్వారా సకాలంలో నీరు రాని పక్షంలో గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు తరలించాలన్నది సంకల్పం. ఇందుకోసం సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 100.225 కి.మీ వద్ద నిర్మించిన సర్ప్లస్ రెగ్యులేటర్ నుంచి మొదలైన రాజీవ్ లింక్ కెనాల్ను ఎన్ఎ్సపీ 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ (52వ కి.మీ)కు అనుసంధానం చేశారు. 52 కి.మీ క్రాస్ రెగ్యులేటర్ను మూసేసి.. 39 కి.మీ. క్రాస్ రెగ్యులేటర్ను ఎత్తేశారు. అక్కడికి సమీపంలోని ఎస్కేప్ లాకుల నుంచి ఎర్రబోడు తండా వద్ద గల నిమ్మ (వెదుళ్ల) వాగులోకి వైరా ఎమ్మెల్యే మాళోతు రాందాస్ నాయక్ మంగళవారం గోదావరి జలాలను అట్టహాసంగా విడుదల చేశారు. దీంతో ఎస్కేప్ లాకుల నుంచి 22 కి.మీ దూరంలోని వైరా రిజర్వాయర్కు నిమ్మవాగును అనుసంధానించారు. తద్వారా బుధవారం వైరా రిజర్వాయర్ను గోదావరి జలాలు ముద్దాడనున్నాయి. ఏపీలో పట్టిసీమ తరహాలో ఖమ్మం జిల్లా ఏన్కూర్ వద్ద నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్తో సుమారు లక్షన్నర ఎకరాల భూమికి సాగు నీరందనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు అసంపూర్తిగా నిలవడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల పట్టుబట్టి రాజీవ్ లింక్ కెనాల్ మంజూరు చేయించడంతోపాటు శంకుస్థాపన .. అటుపై శరవేగంగా పనులు పూర్తి చేశారు. ఈ లింక్ కెనాల్తో ఏడు వేల ఎకరాలు, వైరా, లంకా సాగర్ రిజర్వాయర్లు, ఎన్ఎస్పీ ఆయకట్టు పరిధిలోని 1.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి.