ముప్పై ఏళ్లలో మూడుసార్లు కిడ్నీ మార్పిడి
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:46 AM
ముప్పై ఏళ్లలో మూడుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకుని సాధారణ జీవితం సాగిస్తున్న వ్యక్తి ఒకరు. పాతికేళ్లయినా నిండక ముందే మూత్రపిండ మార్పిడి చేయించుకుని..

మూత్రపిండ మార్పిడి తర్వాత స్టార్ట్పతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మరో వ్యక్తి
‘వరల్డ్ కిడ్నీ డే’ సందర్భంగా స్టార్ ఆస్పత్రిలో అలాంటివారితో ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ముప్పై ఏళ్లలో మూడుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకుని సాధారణ జీవితం సాగిస్తున్న వ్యక్తి ఒకరు. పాతికేళ్లయినా నిండక ముందే మూత్రపిండ మార్పిడి చేయించుకుని.. ఆ తర్వాత ఒక స్టార్ట్పను ప్రారంభించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మరొకరు. గురువారం ‘వరల్డ్ కిడ్నీ డే’ సందర్భంగా.. ఇలాంటి స్ఫూర్తిదాయక జీవితాలను గడుపుతున్నవారితో నానక్రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రి వైద్యులు బుధవారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆస్పత్రి ఎండీ మన్నం గోపీచంద్, నెఫ్రాలజీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ గందే శ్రీధర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 40 ఏళ్లు దాటినవారంతా తరచూ వైద్యపరీక్షలు చేయించుకుని ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిస్థితి గురించి తె లుసుకోవాలని డాక్టర్ మన్నం గోపీచంద్ సూచించారు. కిడ్నీ సమస్యలను సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకుంటే.. పరిస్థితి మార్పిడి వరకూ రాకుండా జాగ్రత్తపడొచ్చని ఆయన పేర్కొన్నారు.
ఎన్నో కష్టాలు..
ఎన్ఎండీసీలో పనిచేసిన సాహు అనే వ్యక్తి 30 ఏళ్లలో మూడుసార్లు కిడ్ని మార్పిడి చేయించుకున్నారు. మరో రెండు నుంచి మూడేళ్లపాటు ఆస్పత్రిలో డయాలసిస్ ఇచ్చారు. మొదట సోదరుడు, రెండోసారి తల్లి ఆయనకు కిడ్నీ దానం చేశారు. తల్లి ఇచ్చిన కిడ్నీతో దాదాపు 11ఏళ్ల పాటు జీవనం సాగించారు. అదీ పాడవడంతో మరో రెండున్నరేళ్లపాటు డయాలసిస్ చేయించుకుంటూ జీవనం గడిపారు. మూడోసారి బయటి దాత నుంచి సేకరించి మార్పిడి చేశారు. ఆ కిడ్నీని అ మర్చి, రక్తనాళాలకు అనుసంధానం చేయడం వైద్యుల కు సవాల్గా మారినా.. ఎట్టకేలకు విజయవంతమైంది.
సొంత స్టార్ట్పతో ఆదర్శంగా
రవితేజ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఎనిమిదేళ్ల క్రితం కిడ్నీలు విఫమయ్యాయి. రెండున్నరేళ్లపాటు ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నారు. ఆయన తల్లి కిడ్నీ దానానికి ముందుకొచ్చినప్పటికీ బ్లడ్ గ్రూపులు వేరు కావడంతో.. ఏబీవోఐ(ఏబీవో ఇన్కంపాటబుల్) పద్ధతిలో మార్పిడి చేశారు. ఎనిమిదేళ్లుగా ఆయన సాధారణ జీవితం గడుపుతున్నారు. మొదట్లో కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసి.. తర్వాత సొంతంగా స్టార్ట్పను ప్రారంభించి ఇప్పుడు అనేక మందికి వైద్యులు, ఇంజనీర్లకు సేవలు అందిస్తున్నారు. ఇక.. ఎస్వీసీ శ్రీతేజ (35) అనే మరో వ్యక్తి కిడ్నీ మార్పిడి తర్వాత.. ఎనిమిదేళ్లుగా మారథాన్లలో చురుగ్గా పాల్గొంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ‘ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని అప్రమత్తంగా ఉంటే నా పరిస్థితి కిడ్నీ మార్పిడి దాకా వచ్చేది కాదు’ అన్నారాయన.