Inspector: విమానం ఎక్కిన సర్కారు బడి పిల్లలు
ABN , Publish Date - May 23 , 2025 | 05:22 AM
పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని విద్యార్థులను ప్రోత్సహించారు ఓ ఇన్స్పెక్టర్.
పదో తరగతిలో భిక్కనూరు విద్యార్థుల ప్రతిభ
వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న ఇన్స్పెక్టర్
భిక్కనూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని విద్యార్థులను ప్రోత్సహించారు ఓ ఇన్స్పెక్టర్. చెప్పినట్లుగానే పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన సర్కారు బడి పిల్లలను గాలి మోటారులో తిప్పారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన గడ్డం మల్లేష్ జీడిమెట్ల సీఐగా పనిచేస్తున్నారు. తాను చదువుకున్న పాఠశాలలో మల్లేష్ ఇటీవల ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారిని విమానం ఎక్కిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసి గురువారం విమానంలో వారిని శంషాబాద్ నుంచి బెంగుళూరుకు తీసుకెళ్లారు. అక్కడ విశ్వేశ్వరయ్య విజ్ఞాన కేంద్రంతో పాటు ముఖ్యమైన ప్రాంతాలను వారికి చూపించారు.