Begumpet scam: రూ.కోటి కారు రూ.20 లక్షలకే
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:39 AM
బేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్ ప్రాంతంలో నివసించే సతీశ్కు ఇటీవల తన సోదరుడి ద్వారా వనస్ధలిపురానికి చెందిన ప్రవీణ్ పరిచయమయ్యాడు.
ప్రభుత్వ ఉద్యోగాలూ ఇప్పిస్తానంటూ యువకుడి మోసం
బేగంపేట, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): సీఎంవోలో ఉద్యోగిని అంటూ డబ్బులు వసూలు చేసి పలువురిని నిండా ముంచాడో వ్యక్తి. అతడిపై 16 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతడి కోసం బేగంపేట పోలీసులు గాలిస్తున్నారు. బేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్ ప్రాంతంలో నివసించే సతీశ్కు ఇటీవల తన సోదరుడి ద్వారా వనస్ధలిపురానికి చెందిన ప్రవీణ్ పరిచయమయ్యాడు. తాను సీఎంవోలో పనిచేస్తానంటూ తన వద్ద ఉన్న గుర్తింపు కార్డును చూపించాడు. ‘‘ఎవరైనా తెలిసిన వారుంటే చెప్పండి. వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాను. మీ వద్ద కార్లు ఉంటే ప్రొటోకాల్ విభాగంలో పెట్టిస్తాను. నెలకు రూ.50వేలకు పైగా అద్దె వస్తుంది’’ అని చెప్పాడు. అలాగే రూ.2.5లక్షల ఐఫోన్ను రూ.50వేలకే ఇప్పిస్తాననీ చెప్పాడు. పూర్తిగా నమ్మిన సతీశ్.. తనకు 4 ఐఫోన్లు కావాలంటూ ప్రవీణ్కు రూ.2లక్షలిచ్చాడు. మరోమారు సతీశ్ను ప్రవీణ్ కలిసి.. ఢిల్లీకి చెందిన ఓ కారు తన వద్ద ఉందని, సుమారు కోటి ఖరీదు చేస్తుందని, తెలిసిన వారుంటే రూ.20 లక్షలకు ఇస్తానని చెప్పడంతో ఆ మొత్తాన్ని సతీశ్ అతడికి చెల్లించాడు. చివరికి తాను మోసపోయినట్లుగా తెలుసుకున్న సతీశ్ ఇటీవల బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ కొన్నేళ్లుగా ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..