CM Revanth Reddy: గ్లోబల్ సమ్మెటే ప్రారంభ వేళ.. సీఎం కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 07 , 2025 | 09:09 PM
హైదరాబాద్లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ప్రారంభం కానుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించే ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అతిథులు హాజరుకానున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 07: విశ్వనగరం హైదరాబాద్లో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పలు బహుళ జాతి సంస్థలు.. అతి పెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దీంతో ఈ నగరం ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా హైదరాబాద్లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ప్రారంభం కానుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించే ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వివిధ రహదారులకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.
రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రహదారికి రతన్ టాటాపేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్లో సాంకేతికతో పాటు పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన కృషికి నివాళిగా ఇప్పటికే రావిర్యాల వద్ద ఇంటర్ చేంజ్కు టాటా పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
యూనైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ పక్కనే ఉన్న రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖతోపాటు అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ సైతం రాసింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రాంతానికి గూగుల్ స్ట్రీట్ అని పిలుస్తారన్న విషయం విదితమే. అలాగే మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ పేర్లపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వినూత్న ఆలోచనకు తెర తీసినట్లు తెలుస్తోంది. నగరంలోని రహదారులకు అంతర్జాతీయ కంపెనీలు – ప్రముఖులకు గౌరవంగా పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.