Hyderabad: అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:38 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
హైదరాబాద్ సిటీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి అరుణాచలం, మంత్రాలయం, భద్రాచలం, కాళేశ్వరానికి సూపర్లగ్జరీ, రాజధాని ఏసీ బస్సులను నడపనున్నట్లు ఆ డిపో మేనేజర్ సుధ సోమవారం తెలిపారు. మూడు రోజుల పాటు సాగే అరుణాచలం యాత్రకు సూపర్ లగ్జరీలో ఒకరికి రూ.4,500, రాజధాని ఏసీ డీలక్స్ బస్సులో ఒకరికి రూ.5 వేలు చార్జీగా వసూలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ యాత్రలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచల , కంచి దేవాలయాలను దర్శించుకోవచ్చన్నారు. ఇక మంత్రాలయం యాత్రలో భాగంగా మన్యంకొండ, కురుమూర్తి దేవాలయాలను దర్శించుకోవచ్చని.. సూపర్లగ్జరీలో రూ.1,250, రాజధాని ఏసీ బస్సులో రూ.1,700 చార్జీగా వసూలు చేయనున్నట్లు వివరించారు. భద్రాచలానికి సూపర్ లగ్జరీలో రూ.1,700, రాజధాని ఏసీ బస్సులో రూ.2,200 చార్జీ ఉంటుందని చెప్పారు. ఇక కాళేశ్వరానికి సూపర్ లగ్జరీలో రూ.1,200, రాజధాని ఏసీ బస్సులో రూ.1,600 చార్జీగా వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 93910 72283, 90634 07072 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.