High Court: రాష్ట్రంలో భూసంస్కరణల చట్టం అమలవుతోందా?
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:36 AM
తెలంగాణ భూసంస్కరణల చట్టం- 1973 అమలు తీరుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భూసంస్కరణల చట్టం- 1973 అమలు తీరుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ సింగూరు జలసాధన కమిటీ అధ్యక్షుడు కంచరి బ్రహ్మం రాసిన లేఖను స్వీకరించి సుమోటో పిటిషన్గా విచారణ చేపట్టింది. కొందరు సీలింగ్ పరిమితిని మించి భారీ విస్తీర్ణంలో వ్యవసాయ భూములను స్వాధీనంలో ఉంచుకుంటున్నారని, కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆదే పని చేస్తున్నాయని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.
ఈ అక్రమాలపై స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ, న్యాయశాఖ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది.