Krishna Basin: ఆల్మట్టికి పోటెత్తిన వరద
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:04 AM
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్కు వరద పోటెత్తింది. ఫలితంగా డ్యామ్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 519.90 మీటర్లకు 516.82 మీటర్లకు చేరుకుంది.
హైదరాబాద్/ధరూరు/దోమలపెంట/బెంగళూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్కు వరద పోటెత్తింది. ఫలితంగా డ్యామ్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 519.90 మీటర్లకు 516.82 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 36 గేట్లు ఎత్తేసి 90 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలశయానికి భారీగా వరద నీరు వస్తోంది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 492.25 మీటర్లకు 490.63 మీటర్లకు చేరుకుంది.
ఎగువ నుంచి 84,445 క్యూసెక్కుల వరద వచ్చి పడుతుండగా, 70 వేల క్యూసెక్కుల నీరు వదిలేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు శనివారం 1.24 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రికార్డయింది. ప్రాజెక్టులో 7.571 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 12 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 86,340 క్యూసెక్కులతో మొత్తం 1,15,978 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో 129.78 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 1,16,607 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. 4,332 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కు 4,484 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తం వదిలి పెడుతున్నారు.