Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:39 AM
ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది.
115.7856 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ
హైదరాబాద్/ ధరూర్/ దోమలపెంట/నంద్యాల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి కొన్ని రోజులుగా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయం నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నుంచి గురువారం సాయంత్రానికి 88,272 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్లో 115.7856 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, 863.10 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు. తుంగభద్ర ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. కాగా, ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు స్థిరంగా వరద కొనసాగుతుండటంతో గురువారం జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తేశారు.
ఆల్మట్టిలో 80.97 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, దిగువకు 70,420 క్యూసెక్కులు, నారాయణపూర్లో 30.64 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, దిగువకు 68,498 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 98 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 317.360 మీటర్లలో 7.389 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు 1,03,414 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, జూన్ నెలాఖరులో రావాల్సిన వరద మే నెలలోనే రావడంతో ప్రాజెక్టు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు నిలిపేశారు. మరోవైపు, తెగిపోయిన తొమ్మిదో గేటు రోప్ అమర్చే ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు నిలకడగా వరద వచ్చి చేరుతుండటంతో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.