Srisailam: 4 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్!
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:13 AM
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం జలాశయానికి 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా..
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం జలాశయానికి 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. 157.49 టీఎంసీల నిల్వ ఉంది. 885 అడుగులకు గాను 873.70 అడుగుల్లో నీటి మట్టం నమోదైంది. శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండేందుకు మరో 58 టీఎంసీలు కావాల్సి ఉంది. రోజుకు సగటున సమారుగా 12 టీఎంసీల నీరు చేరుతుండటంతో మరో ఐదు రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండనుంది. దీంతో నాలుగు రోజుల్లోనే గేట్లు ఎత్తే అవకాశముంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో అధికారులు ఉత్పత్తి ప్రారంభించారు.
ఇక జూరాల ప్రాజెక్టుకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో వానలు కురిశాయి. సాయంత్రం తర్వాత హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని జిల్లాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.