Future City: ఫ్యూచర్ సిటీకి సమీపంలో.. మరో 821 ఎకరాల భూసేకరణ
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:51 AM
ఫ్యూచర్ సిటీని నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ప్రతిపాదిత గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూసేకరణ చేపడుతోంది. ఫ్యూచర్సిటీ పరిధిలోని కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో 366.04 ఎకరాలు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
ఫ్యూచర్ సిటీని నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ప్రతిపాదిత గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూసేకరణ చేపడుతోంది. ఫ్యూచర్సిటీ పరిధిలోని కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో 366.04 ఎకరాలు, కొంగర కుర్ధులో 277 ఎకరాలు కలిపి.. మొత్తం 643 ఎకరాల భూసేకరణకు జిల్లా కలెక్టర్ బుధవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫ్యూచర్ సిటీకి సమీపంలోని యాచారం మండలం మొండిగౌరెల్లిలో పారిశ్రామిక పార్కు కోసం 821.11 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అధికశాతం అసైన్డ్ భూములే ఉన్నాయి. సర్వే నంబరు 19, 127లతోపాటు సమీపంలోని మరికొన్ని సర్వేనంబర్లలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో సింహభాగం సర్వేనంబరు 19లో 375.27 ఎకరాలు, సర్వేనంబరు 68లో 188.3 ఎకరాలు, సర్వేనంబరు 127లో 113.34 ఎకరాల భూములు ఉన్నాయి.
వీటి చుట్టుపక్కల పట్టాభూములు కలిపి.. పలు సర్వే నంబర్ల నుంచి కూడా మరికొంత భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. ఫ్యూచర్ సిటీకి ఆనుకుని ఉన్న మొండిగౌరెల్లిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు భారీ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు.. త్వరలో ఈ గ్రామాన్ని కూడా ఫ్యూచర్ సిటీలో కలిపేయోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే మొండిగౌరెల్లికి చెందిన నేతలు కొందరు తమ గ్రామాన్ని కూడా ప్యూచర్ సిటీలో కలపాలంటూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కాగా.. ఫ్యూచర్ సిటీ పరిధిలో మరింత భూసేకరణకు నోటిఫికేషన్లను సిద్ధం చేస్తున్నారు. త్వరలో కందుకూరు మండలం తిమ్మాపూర్లో 600 ఎకరాలు, పంజాగూడలో 300ఎకరాల భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.