Ganesh Immersion: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం.. 6న సెలవు
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:13 AM
గణేష్ నిమజ్జన ఊరేగింపు కారణంగా ఈ నెల 6న (శనివారం) ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డికి వర్తింపు
అక్టోబరు 11న రెండో శనివారం వర్కింగ్ డే
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జన ఊరేగింపు కారణంగా ఈ నెల 6న (శనివారం) ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఉంటుందని తెలిపింది. శనివారం సెలవు ఇస్తున్నందున... అక్టోబరు 11న రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు పని దినం(వర్కింగ్ డే) వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
పంప్డ్ స్టోరేజీలకు సీఈఏ అనుమతి అక్కర్లేదు
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : దేశంలో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ) అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే సీఈఏ నుంచి సాంకేతిక సహాయం తీసుకోవచ్చని సూచించింది. ఈమేరకు బుధవారం కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక రూ.3 వేల కోట్లకు పైగా వెచ్చించి.. కట్టే జల విద్యుత్ కేంద్రాలు విధిగా సీఈఏ అనుమతి తీసుకోవాలని నిర్దేశించింది.
పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ కేంద్రాలు జాతీయ ఆనకట్టల భద్రత చట్టం(ఎన్డీఎస్ఏ)-2021లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని గుర్తుచేసింది. ఇప్పటిదాకా పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే విధిగా సీఈఏ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉండగా... దీన్ని సవరించింది. ఇది తెలంగాణలో ఏర్పాటు కానున్న ఏడు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలకు శుభవార్త కానుంది.