Jurala Project: జూరాలలో తెగిన గేట్ల రోప్లు!
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:31 AM
ఎగువ నుంచి వరద వస్తున్న వేళ జూరాల ప్రాజెక్టులో రెండు గేట్లకు సంబంధించిన రోప్లు తెగిపోయాయి. 9వ, 12వ నంబర్ గేట్లకు సంబంధించిన రోప్లు తెగి, వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
9, 12వ నంబర్ గేట్ల రోప్లు వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
2 నెలలుగా మరమ్మతులు
ముందస్తు వరదలతో అంతరాయం
ఈ క్రమంలోనే ఘటన!
రోప్లు తెగిపోలేదు.. ప్రమాదమేమీ లేదు
పనులు కొనసాగుతున్నాయి: ఎస్ఈ
గద్వాల/ధరూరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : ఎగువ నుంచి వరద వస్తున్న వేళ జూరాల ప్రాజెక్టులో రెండు గేట్లకు సంబంధించిన రోప్లు తెగిపోయాయి. 9వ, 12వ నంబర్ గేట్లకు సంబంధించిన రోప్లు తెగి, వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక వైపు గేట్లకు మరమ్మతులు జరుగుతుండగానే.. ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఇదంతా ప్రచారమేనని, ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని జూరాల ఎస్ఈ వివరణ ఇచ్చారు. జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 గేట్లు ఉన్నాయి. రబ్బరు సీల్స్ ఊడి లీకేజీలు జరగడం, గ్రీసింగ్ లేకపోవడంతో రోప్లు తుప్పు పట్టడం, ఏటా పూర్తి స్థాయిలో నిర్వహణ లేకపోవడం.. ఇలా అనేక కారణాలతో క్రస్ట్ గేట్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ ఏడాది 8, 12, 19, 27, 28, 41, 45, 51 గేట్ల రోప్లను మార్చాలని నిర్ణయించి.. పనులు చేపట్టారు. అయితే, గేట్ల మరమ్మతులకు వినియోగించే గ్యాంటీ క్రేన్ తరచూ మొరాయిస్తుండడంతో రెండు నెలలుగా నాలుగు (28, 41, 45, 51వ నంబర్) గేట్లకు మాత్రమే కొత్త రోప్లను బిగించారు.
మిగిలిన 28, 12, 19, 27 గేట్ల రోప్లను మార్చాల్సి ఉండగా... కృష్ణా పరివాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ముందుగానే ప్రాజెక్టులోకి వరద వచ్చింది. దీంతో పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత స్టాప్ లాక్ ఏర్పాటు చేసి, మరమ్మతులను మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని సార్లు లక్ష క్యూసెక్కులకుపైగా వరద రావడం, స్టాప్లాక్పై నుంచి నీరు పారడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సదరు సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో నీళ్లలోకి దిగి కొన్నాళ్లు మరమ్మతులు చేపట్టారు. అయితే, అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో నీళ్లలో ఎక్కువ సేపు ఉండడం ఇబ్బందిగా మారి, పనులకు ఆటంకం కలిగింది. ఇదిలా కొనసాగుతుండగానే.. 9వ, 12వ నంబర్ గేట్లకు సంబంధించిన రోప్లు తెగి వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 34వ గేటు రోప్ కూడా బలహీనంగా ఉందంటూ ప్రచారం జరిగింది. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు.. ప్రాజెక్టు ఎస్ఈ రహిముద్దీన్కు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే, గేట్ల రోప్లు తెగిపోలేదని, సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని ఎస్ఈ కోరగా.. వరద వస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఎంత వరదొచ్చినా.. ముప్పు ఏమీ లేదు
గేట్ల రోప్లు తెగిపోయాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో జూరాల ప్రాజెక్టు ఎస్ఈ రహిముద్దీన్ గురువారం మీడియాకు వివరణ ఇచ్చారు. గేట్ల మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయని, 9వ, 12వ నంబర్ గేట్ల రోప్స్ తెగిపోలేదని స్పష్టం చేశారు. ఎక్కువ వరద వచ్చి పనులు నిలిచిపోయినా, ప్రాజెక్టుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. 2009లో 12లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా 50 గేట్లను మాత్రమే తెరిచామని గుర్తు చేశారు. ఒకవేళ అన్ని గేట్లను తెరవాల్సి వస్తే క్రేన్ల సాయంతో తెరుస్తామని వివరించారు. మిషన్ భగీరథ పథకం కోసం ఏడాదంతా ప్రాజెక్టులో నీరు నిల్వ చేయాల్సిన పరిస్థితి ఉంటోందని, ఈ కారణంగానే మరమ్మతు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాగా, జూరాల ప్రాజెక్టుపై ప్రభుత్వంతోపాటు అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News