Tandel Movie: సిక్కోలు వ్యథే.. తండేల్ కథ!
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:57 AM
శ్రీకాకుళం జిల్లా కు చెందిన అనేకమంది మత్స్యకారుల దయనీయ పరిస్థితికి అద్దంపట్టే కథ! స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపల వేట గిట్టుబాటుకాక.. ఇతర ప్రాంతాల కు వలస వెళ్లి నానా కష్టాలు పడుతున్నారు.

జిల్లాలో 104 మత్స్యకార గ్రామాలు.. స్థానికంగా ఉపాధి లేక తంటాలు.. ఏటా దూరప్రాంతాలకు వలస
పొరపాటున గీత దాటినా పొరుగు దేశాల జైలులో మగ్గాల్సిందే!
2018లో పాకిస్థాన్ బందీలుగా పలువురు జాలర్లు
13 నెలల పాటు జైల్లో నరకయాతన
అదే ఇతివృత్తంగా సినిమా నిర్మాణం
(రణస్థలం - ఆంధ్రజ్యోతి)
కనుచూపు మేరా సముద్రం! సరిహద్దుల గీతలు కనిపించని జలాలు! ఆ ‘కనిపించని గీత’ను వాళ్లు దాటారు! పాకిస్థాన్ చెరలో చిక్కారు! 13 నెలలపాటు పాక్ జైళ్లలో మగ్గారు! ఈ యథార్థ వ్యథ... ‘తండేల్’గా వెండితెరపైకి ఎక్కింది! ఇది... శ్రీకాకుళం జిల్లా కు చెందిన అనేకమంది మత్స్యకారుల దయనీయ పరిస్థితికి అద్దంపట్టే కథ! స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపల వేట గిట్టుబాటుకాక.. ఇతర ప్రాంతాల కు వలస వెళ్లి నానా కష్టాలు పడుతున్నారు. అందు లో యువకులే ఎక్కువ. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గుజరాత్లోని వీరావల్ ప్రాంతానికి వలస వెళతారు. ఫిబ్రవరి, మార్చిలో స్వస్థలాలకు చేరుతారు.
సముద్రమున్నా... ఉపాధి లేదు!
శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 104 మత్స్యకార గ్రామాలున్నాయి. జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు కానీ, జెట్టీలు కానీ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సంప్రదాయ వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు గాక జిల్లా నుంచి వేలాది మంది మత్స్యకారులు చెన్నై, ముంబై, కోల్కతా, పారాదీప్, వీరావల్ (గుజరాత్) వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. బృందాలుగా వెళ్లి... అక్కడున్న వ్యాపారుల వద్ద పనికి కుదురుతారు. అక్కడున్నన్ని రోజులు సముద్రానికే అంకితమవుతారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడతారు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. వీరి సమస్యను పరిష్కరించి... స్థానికంగా ఉపాధి కల్పించేలా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో భావనపాడు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది. ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో హార్బర్ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. తర్వాత భావనపాడు హార్బర్ను మూలపేటకు మార్చారు. ఎన్నికల స్టంట్లో భాగంగా అప్పట్లో మంచినీళ్లపేటలో జెట్టీ, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి వైసీపీ నేతలు శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పనులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.
ఇదీ అసలు కథ..
2018లో కె.మత్స్యలేశం గ్రామం నుంచి మత్స్యకారులు పదుల సంఖ్యలో గుజరాత్లోని వీరావల్కు వలస వెళ్లారు. ఆ ఏడాది నవంబరు 30న పొరబాటున పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారు. వెంటనే ఆ దేశ భద్రతా దళాలు వారిని నిర్భందించాయి. పాకిస్థాన్ జైల్లో వారు 13 నెలల పాటు మగ్గిపోతూ అష్టకష్టాలు పడ్డారు. ఆ సమయంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్కు ఈ విషయాన్ని తరచూ విన్నవించేవారు. అప్పట్లో ఆమె పాకిస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. దాంతో 2020 జనవరి 6న మత్స్యకారులు విడుదలయ్యారు. ఇదే ఇతివృత్తంగా తండేల్ సినిమా వచ్చింది.
ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం!
వీరావల్ ప్రాంతంలో జెట్టీ నుంచి చేపలవేటకు వెళ్లాం. దాదాపు వేట పూర్తయింది. మరో అరగంటలో బయలుదేరుతామనగా.. మాకు చెందిన మూడు బోట్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి చేరాయి. దీంతో అక్కడి కోస్టుగార్డులు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాం. ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం. మమ్మల్ని జైల్లోకి తీసుకెళ్లేసరికి 300 మంది విదేశీ మత్స్యకారులు ఉన్నారు. జైల్లో నరకయాతన పడ్డాం.
- రామారావు, బోటు డ్రైవర్ (తండేల్), కె.మత్స్యలేశం.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..