Hyderabad: నాన్న, ఇద్దరు కుమార్తెలు.. ముగ్గురూ జడ్జిలే
ABN , Publish Date - May 03 , 2025 | 05:13 AM
న్యాయాధికారి అయిన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా న్యాయాధికారులు అయ్యారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): న్యాయాధికారి అయిన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా న్యాయాధికారులు అయ్యారు. హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి కే ఖుషా కుమార్తెల్లో ఒకరైన భావన.. ప్రస్తుతం మహబూబ్నగర్లోని 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. ఆయన మరో కుమార్తె నిఖిషా.. ఇటీవల న్యాయాధికారి అయ్యారు. బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే న్యాయ విద్యను అభ్యసించిన నిఖిషా.. 2022లో జరిగిన జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు.
ఆ సమయంలో ఆమె గర్భిణి కాగా.. కవల పిల్లలను ప్రసవించిన నిఖిషా తిరిగి పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2024లో జరిగిన ప్రిలిమ్స్, ఆ ఏడాది నవంబరులో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో, 2025 ఏప్రిల్లో జరిగిన ఇంటర్వ్యూలో విజయం సాధించారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. కుమార్తెలిద్దరూ న్యాయాధికారులు కావడంతో తండ్రి కే ఖుషా ఆనందంలో ఉన్నారు.