Hyderabad: కారును వెనుక నుంచి ఢీకొన్న మరో కారు
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:12 AM
హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృగవని జింకల పార్కు వద్ద వెనకాల నుంచి అతి వేగంగా వచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది.
డివైడర్ను దాటి లారీ కిందకు దూసుకెళ్లడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
మొయినాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృగవని జింకల పార్కు వద్ద వెనకాల నుంచి అతి వేగంగా వచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అటుగా వస్తున్న ఓ లారీ కిందకు దూసుకెళ్లడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ నార్సింగికి చెందిన సిద్దార్థ (27) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
మంగళవారం సిద్దార్థ నార్సింగి నుంచి మొయినాబాద్ వైపు తన కారులో వెళ్తుండగా, మృగవని జింకల పార్కు వద్ద వెనకాల నుంచి అతి వేగంగా వస్తున్న మరోకారు అతని కారును బలంగా ఢీకొట్టింది. దాంతో సిద్దార్థ కారు డివైడర్ పైనుంచి రోడ్డు అవతలివైపుకు దూసుకెళ్లి మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సిద్దార్థ అక్కడికక్కడే మృతి చెందాడు. సిద్దార్థ కారును వెనకాల నుంచి ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.