Family Dispute: భార్యా భర్తల పంచాయితీలో ఘర్షణ
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:58 AM
భార్యాభర్తల మధ్య పంచాయితీలో ఘర్షణ జరిగి ఇరు కుటుంబాలు కత్తు లు, కర్రలతో దాడి చేసుకున్నా యి.
కత్తులు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు
ఇద్దరి మృతి.. నలుగురికి గాయాలు
పెద్దపల్లి జల్లాలో ఘటన
సుల్తానాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల మధ్య పంచాయితీలో ఘర్షణ జరిగి ఇరు కుటుంబాలు కత్తు లు, కర్రలతో దాడి చేసుకున్నా యి. ఈ వివాదంలో ఇద్దరు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం తారకరామనగర్కు చెందిన మోటం సారయ్య కుమారుడు మారయ్యకు పెద్దపల్లికి చెందిన లక్ష్మికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ దంపతుల మధ్య ఆరు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పోలీస్టేషన్లో ఫిర్యాదులు, పెద్ద మనుషుల మధ్య పంచాయితీలు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం పెద్దపల్లి, ఓదెల మధ్య ఉన్న సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి పెట్రోల్ బంక్ దగ్గరున్న ఖాళీ స్థలంలో పంచాయితీకి ఏర్పాటు చేశారు. దీనికి ఇరు కుటుంబాల వారు, బంధువులు హాజరయ్యారు. పంచాయితీలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఒక్కసారిగా లక్ష్మి తరఫు వారు కత్తులు, కర్రలతో దాడికి దిగారు. గాయపడిన వారిని సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మోటం మల్లేశ్(35) చనిపోయాడు. ఈయన మారయ్య సోదరుడు. లక్ష్మి తరఫున పంచాయితీకి వచ్చిన పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన గాండ్ల గణేశ్(32) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘర్షణలో నలుగురు గాయపడ్డారు.