Eli Lilly to Invest: రూ.8,800 కోట్లు
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:26 AM
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఔషధ తయారీ కంపెనీ ఎలి లిల్లీ.. భారతదేశంలోనే తమ మొట్టమొదటి తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది...
రాష్ట్రంలో అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ పెట్టుబడులు
దేశంలోనే ఆ కంపెనీ తొలి తయారీ
కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటుకు సిద్ధం
సీఎం రేవంత్రెడ్డితో సంస్థ ప్రతినిధుల చర్చలు
వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు
త్వరలోనే నియామకాలు: కంపెనీ ప్రకటన
తెలంగాణకు ఇది ఒక గర్వకారణం
ఫార్మా కంపెనీలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఔషధ తయారీ కంపెనీ ఎలి లిల్లీ.. భారతదేశంలోనే తమ మొట్టమొదటి తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దీనికోసం 100 కోట్ల డాలర్ల (రూ.8,871 కోట్లు) పెట్టుబడులు పెడతామని తెలిపింది. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఎలి లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి పాల్గొన్నారు. చర్చల అనంతరం ఎలి లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళిక, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సహకారంతో అధునాతన ఔషధ తయారీ యూనిట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇక్కడి నుంచే దేశంలో ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనున్నట్లు పేర్కొంది. ఫార్మా తయారీ యూనిట్ ఏర్పాటుతో రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మారంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని.. వీలైనంత త్వరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారి ఏర్పాటు చేస్తున్న అధునాతన యూనిట్.. తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుందని పేర్కొన్నారు. తాజాగా, దేశంలోనే తమ తొలి ఫార్మా తయారీ కేంద్రాన్ని తెలంగాణలో నెలకొల్పటానికి ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. విస్తరణలో భాగంగా ఎలి లిల్లీ కంపెనీ భారీ పెట్టుబడులకు సిద్ధపడటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇది ఒక గర్వకారణమని అన్నారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామా హైదరాబాద్: సీఎం
దేశంలోనే ఫార్మా హబ్గా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 1961లో ఐడీపీఎల్ను స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారిందని, ప్రస్తుతం 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందిస్తామన్నారు. హైదరాబాద్లో ఎలి లిల్లీ కంపెనీ హబ్ ఏర్పాటుతో రాష్ట్రంలో పలువురికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎలి లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ వేగవంతమైన వృద్ధిని సాధిస్తోందన్నారు.
150 ఏళ్ల కంపెనీ
అమెరికాకు చెందిన ఎలి లిల్లీ కంపెనీ 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో కొనసాగుతోంది. ప్రధానంగా మధుమేహం, స్థూలకాయం, ఆల్జీమర్, క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తోంది. మన దేశంలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎలి లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి. హైదరాబాద్లో ఈ ఏడాది ఆగస్టులోనే గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది.