Land Dispute: కన్నవారిని ఇంట్లోంచి గెంటేసి తాళం
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:37 AM
ఆ వృద్ధ దంపతులను వేధించుకుతిన్నాడో కుమారుడు! భూమి ఇచ్చేది లేదని దంపతులు చెప్పడంతో వారి బట్టలు, వంట పాత్రలు, ఇతర సామగ్రిని బయటకు విసిరికొట్టి..
వృద్ధులైన తల్లిదండ్రులపై కుమారుడి దాష్టీకం
భిక్కనూరు, జూన్ 7(ఆంధ్రజ్యోతి): నలుగురు కుమారులకు సమానంగా భూమి పంచి ఇచ్చిన ఆ తల్లిదండ్రులు కొంత భూమిని తమ పేరిటే ఉంచుకున్నారు. ఆ భూమిపైనా కన్నేసి.. ఆ వృద్ధ దంపతులను వేధించుకుతిన్నాడో కుమారుడు! భూమి ఇచ్చేది లేదని దంపతులు చెప్పడంతో వారి బట్టలు, వంట పాత్రలు, ఇతర సామగ్రిని బయటకు విసిరికొట్టి.. వారిని ఇంట్లోంచి గెంటేసి తాళం వేశాడు! కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మర్రి బాగవ్వ-రాములు దంపతులకు నలుగురు కుమారులు. వీరికి ఊర్లో 5.04 ఎకరాల భూమి ఉంది. గతంలోనే నలుగురు కుమారులకు ఎకరం చొప్పున పట్టాచేసి ఇచ్చి.. మిగతా 1.04 ఎకరాలను తమ పేరిటే ఉంచుకున్నారు ఆ వృద్ధ దంపతులు. భార్యతో కలిసి నిజామాబాద్లో ఉంటున్న మూడో కుమారుడు చంద్రం, నెల క్రితం ఇంటికొచ్చాడు. మిగతా భూమినీ పంచాలని, తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించి అప్పులు కట్టుకుంటానని తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. తాము బతికున్నంత కాలం ఎవరికి ఆ భూమిని పంచబోమని వారు చెప్పగా గొడవపడి.. వృద్ధ దంపతులను ఇంట్లోంచి బయటకు గెంటేసి, తాళం వేశాడు. చంద్రం తీరుపై వృద్ధ దంపతులు శనివారం ఏఎస్పీ చైతన్యరెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే, భిక్కనూరు పోలీసుస్టేషన్లో వృద్ధ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రం అతడి భార్య సునీతతో పాటు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించినమరోవ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..