Election Commission: ఇక అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్కాస్టింగ్
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:14 AM
పోలింగ్ జరుగుతున్న తీరును మరింత నిశితంగా పరిశీలించడానికి నూరు శాతం వెబ్కాస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఎలక్షన్ కమిషన్ నిర్ణయం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికార్లకు లేఖ
న్యూఢిల్లీ, జూన్ 16: పోలింగ్ జరుగుతున్న తీరును మరింత నిశితంగా పరిశీలించడానికి నూరు శాతం వెబ్కాస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ప్రస్తుతం 50 శాతం పోలింగ్ స్టేషన్ల నుంచే వెబ్కాస్టింగ్ జరుగుతుండగా ఇకపై మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి నూరు శాతం వెబ్కాస్టింగ్ జరపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సోమవారం లేఖలు రాసింది.
ఈ ఏడాది చివర్లో బిహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూరు శాతం వెబ్కాస్టింగ్ విధానాన్ని అమలు చేస్తారు. ఇంతవరకు సంక్షిష్టమైన పోలింగ్ స్టేషన్లకే పరిమితమైన ఈ సదుపాయాన్ని ఇక నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లకు వర్తింపజేస్తారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న చోట్ల మాత్రమే వెబ్కాస్టింగ్ సాధ్యపడుతుంది.