Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం!
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:25 AM
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారంలో ఈగల్ ఎక్స్పర్ట్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ సరోజా శిష్యంత్ను తాజాగా అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ షికా గోయల్ చెప్పారు.
‘ఈగల్ ఎక్స్పర్ట్ ఇమ్మిగ్రేషన్’ డైరెక్టర్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ
ఇప్పటికే ఐదుగురి అరెస్టు..
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారంలో ఈగల్ ఎక్స్పర్ట్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ సరోజా శిష్యంత్ను తాజాగా అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ షికా గోయల్ చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ‘అబ్రాడ్ స్టడీ ప్లాన్ కన్సల్టెన్సీ’ నిర్వహిస్తున్న గంటా అనిల్కుమార్ అతని సోదరుడు సునీల్ కుమార్.. మిత్రులతో కలిసి మరో చోట ఈగల్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారన్నారు. వీరంతా కలిసి నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకు వసూలు చేసి.. అక్కడ ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేస్తున్నారని ఆమె వివరించారు. వీరి ద్వారా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని మాల్టా దేశం వెళ్లి మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామన్నారు. ఈ ముఠా హైదరాబాద్తో పాటు విజయవాడ, ఢిల్లీలోనూ ఆఫీసులు తె రిచి మోసాలకు పాల్పడ్డారని తెలిపారు.
నల్సార్ వర్సిటీతో సైబర్ సెక్యూరిటీ ఒప్పందం
హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు సైబర్ నేరాల్లో దర్యాప్తునకు సంబంధించి నల్సార్ అధ్యాపకుల సాయాన్ని తీసుకోవడమే కాకుండా నూతన సైబర్ చట్టాలు, ఫోరెన్సిక్ పరిశోధనల గురించి సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామని షికా గోయల్ వెల్లడించారు.