Akash Missile: ఆకాశ్ పనితీరు చూసేందుకు.. కలాం ఉంటే బాగుండేది!
ABN , Publish Date - May 19 , 2025 | 04:56 AM
ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాక్ మనదేశంపైకి ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తుత్తునియలు చేసిన ఆకాశ్ క్షిపణుల తయారీ అబ్దుల్ కలాం కలల ప్రాజెక్టు అని.. దానికి ఆయన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని డీఆర్డీవో రిటైర్డ్ శాస్త్రవేత్త, కర్ణాటకకు చెందిన డాక్టర్ ప్రహ్లాదరామారావు పేర్కొన్నారు.
‘ఆంధ్రజ్యోతి’తో డీఆర్డీవో మాజీ శాస్త్రవేత్త, ఆకాశ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రహ్లాదరామారావు
అల్వాల్, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాక్ మనదేశంపైకి ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తుత్తునియలు చేసిన ఆకాశ్ క్షిపణుల తయారీ అబ్దుల్ కలాం కలల ప్రాజెక్టు అని.. దానికి ఆయన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని డీఆర్డీవో రిటైర్డ్ శాస్త్రవేత్త, కర్ణాటకకు చెందిన డాక్టర్ ప్రహ్లాదరామారావు పేర్కొన్నారు. ఆకాశ్పనితీరు చూడటానికి ఆయన ఇక్కడ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రక్షణ రంగంలో కీలకమైన ప్రాజెక్టులన్నింటికీ కేంద్రస్థానంగా మారిన హైదరాబాద్ డీఆర్డీవోలో అభివృద్ధి చేసిన అనేక రక్షణ ఉత్పత్తులు యుద్ధరంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. ఇంటిగ్రేటేడ్ గైడెడ్ మిసైల్స్ డెవల్పమెంట్ ప్రోగ్రామ్కు నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రహ్లాదరామారావుకు ఆకాశ్ ప్రాజెక్టు డైరెక్టర్గా ఇక్కడ అత్యంత కీలకమైన భాధ్యతను అప్పగించారు. అలా తాము అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణులు దాయాది దేశ విమానాలను, క్షిపణులను విజయవంతంగా తిప్పికొట్టడం ఆనందం కలిగించిందని.. అది తన జీవితంలోనే అత్యంత సంతృప్తికరమైన రోజు అని ప్రహ్లాదరామారావు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ఆకాశ్ క్షిపణిని అభివృద్ధి చేసే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ.. కలాం మద్దతుతో ప్రాజెక్టును కొనసాగించామని తెలిపారు.