Yacharam: ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య
ABN , Publish Date - May 31 , 2025 | 03:52 AM
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ నాయకులు, తన బావ బండ యాదయ్య.. తన చావుకు కారణమంటూ అరచేతిపై రాసుకుని మరీ ఉరి వేసుకున్నాడు.
తన చావుకు కాంగ్రెస్ నాయకులే కారణమని అరచేతిపై రాతలు
రంగారెడ్డి జిల్లాలో ఘటన
యాచారం, మే 30 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ నాయకులు, తన బావ బండ యాదయ్య.. తన చావుకు కారణమంటూ అరచేతిపై రాసుకుని మరీ ఉరి వేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లకు చెందిన దొడ్డి అశోక్(45)కు భార్య రజని, కుమార్తెలు లహరి, నిఖిత, సుష్మాస్వరాజ్ ఉన్నారు. వీరంతా గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అశోక్, రజని కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అశోక్ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా.. స్థలం కూడా లేకపోవడంతో ఇల్లు మంజూరు కాలేదు. నిరుపేద కుటుంబమైన తమకు ఇల్లు కేటాయించాలని నాయకులు, అధికారులను కలిసి విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అశోక్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు.. అశోక్ మృతదేహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి ధర్నా చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రమై పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు, తహసీల్దారు అయ్యప్ప, ఇన్చార్జి ఎంపీడీవో శైలజ ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. విషయాన్ని ఆర్డీవో అనంతరెడ్డికి ఫోన్లో వివరించారు. బాధిత కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకుంటామని తహసీల్దారు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్