Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి
ABN , Publish Date - May 18 , 2025 | 05:01 AM
ఓ రైతుపై మొసలి దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధి కూసుమూర్తి గ్రామ శివారు భీమానదిలో శనివారం చోటుచేసుకుంది.
కృష్ణ, మే 17 (ఆంధ్రజ్యోతి): ఓ రైతుపై మొసలి దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధి కూసుమూర్తి గ్రామ శివారు భీమానదిలో శనివారం చోటుచేసుకుంది. కూసుమూర్తికి చెందిన రైతులు జింకల తిప్పన్న(55), శివప్ప గౌడకలిసి తిప్పన్న నారుమడి వద్దకు వెళ్లారు. నీటి మోటార్ను ఆన్ చేయగా నీళ్లు పోయలేదు.
ఫుట్బాల్ నుంచి మోటార్ పంపునకు నీరు రావడంలేదని గమనించి అక్కడున్న చెత్తను తొలగించేందుకు తిప్పన్న నీళ్లలోకి దిగాడు. అక్కడే ఉన్న మొసలి ఆయనపై ఒక్కసారిగా దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లిందని శివప్ప చెప్పారు. ఆయన సమాచారంతో గ్రామస్థులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్లను రప్పించి తిప్పన్న కోసం గాలింపు చేపట్టారు.