Congress: వరంగల్ నేతల వివాదంపై వీహెచ్ నేతృత్వంలో కమిటీ!
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:35 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి నేతల మధ్య సమన్వయం తెచ్చేందుకు పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆధ్వర్యంలో ఓ కమిటీ వేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది.
గజ్వేల్ నేతల వివాదంపై సబ్ కమిటీ ఏర్పాటు..
రాజగోపాల్రెడ్డి అంశంపై మారోమారు సమావేశం
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీలో నిర్ణయాలు..
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి నేతల మధ్య సమన్వయం తెచ్చేందుకు పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆధ్వర్యంలో ఓ కమిటీ వేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. చైర్మన్ మల్లు రవి ఆధ్యక్షతన గాంధీభవన్లో ఆదివారం భేటీ అయిన కమిటీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్లో జరుగుతున్న అంశాలపైన కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఒక కమిటీ వేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.
కాగా.. ఇటీవల మంత్రి వివేక్ సమక్షంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి.. గజ్వేల్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతపై దాడి చేసిన ఘటనపై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. దీనిపై విచారణ కోసం కమిటీ కన్వీనర్ శ్యామ్మోహన్ నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ.. మంగళవారం మంత్రి వివేక్ను కలిసి ఘటనకు సంబంధించి వివరాలను సేకరించనుంది. ఇటు మంత్రి పదవికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంశంపైనా కమిటీలో చర్చించారు. దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరోమారు సమావేశం అవ్వాలని నిర్ణయించారు.