Share News

Big Boss Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:32 AM

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ కమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Big Boss Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
Big Boss Telugu

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 16: తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ సిద్దపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన యువకులు కమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


తెలుగు బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని వీరు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని పేర్కొన్నారు. కుటుంబ విలువలు పాటించని వారిని బిగ్ బాస్ టీం ఎంచుకుందని.. సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షోపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలని హితవు పలికారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? అని యువకులు ప్రశ్నించారు.


గత కొద్ది రోజుల క్రితం కన్నడ బిగ్ బాస్ షో సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కన్నడ హీరో కిచ్చా సుదీప్ఈ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో స్టూడియోను అధికారులు సీజ్ చేశారు కార్యక్రమం జరుగుతున్న బిడదిలోని అమ్యూజ్ మెంట్ పార్క్ జూలీవుడ్ స్టూడియో నుంచి రోజు 2.5 లక్షల లీటర్ల శుద్ది చేయని నీరు బయటకు వస్తుందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకున్న కాలుష్య నియంత్రణ మండలి బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను షో నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఎమ్మార్వో తేజస్విని అధికారులతో కలిసి బయట నుంచి తాళాలు వేశారు. దీంతో బిగ్ బాస్ షో షూటింగ్ నిలిచిపోయింది. ఈ రియాల్టీ షోలో పాల్గొన్న 17 మంది పోటీదారులను ఈగిల్టన్ రిసార్ట్‌ లో ఉంచారు. ఆ తర్వాత షో పునః ప్రారంభం అయ్యింది.

Updated Date - Oct 16 , 2025 | 02:04 PM