Sangareddy: సంజీవనగర్ పాఠశాలలో బాత్రూం నిర్మాణానికి 7 లక్షలు మంజూరు
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:07 AM
సంగారెడ్డిలోని సంజీవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాత్రూంల నిర్మాణానికి సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య రూ.7 లక్షలు మంజూరు చేశారు.
ఒకట్రెండు రోజుల్లో పనులు ప్రారంభం
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన కలెక్టర్
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డిలోని సంజీవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాత్రూంల నిర్మాణానికి సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య రూ.7 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థుల ఇబ్బందులపై ‘113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూం’ అనే శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి డీఈవో ఎస్. వెంకటేశ్వర్లు, ఎంఈవో విద్యాసాగర్ పాఠశాలను పరిశీలించారు.
తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్యూఐడీసీ) డీఈ రాజు, ఏఈ రాజమల్లయ్యతో కలిసి బాత్రూంల స్థలాన్ని పరిశీలించారు. రూ.3.5 లక్షల చొప్పున రెండు బాత్రూంలకు మొత్తం రూ.7 లక్షల నిధులు అవసరమవుతాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించారు. దీంతో ఆ మేరకు కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. ఒకట్రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.