KTR: రేవంత్ దరిద్రపు పాలనకు అసమర్థ ఆస్కార్ అవార్డు
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:18 AM
అన్నదాతను అప్పుల పాల్జేసిన పాలకులను చూశాం కానీ, ఇప్పుడు వారిని చెప్పుల పాల్జేసిన చెత్త రికార్డు మాత్రం సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అన్నదాతను అప్పుల పాల్జేసిన పాలకులను చూశాం కానీ, ఇప్పుడు వారిని చెప్పుల పాల్జేసిన చెత్త రికార్డు మాత్రం సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన దరిద్రపు గొట్టు పాలనకు అసమర్థ ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. యూరియా బస్తా కోసం చెప్పుల లైన్ వద్ద పడుకున్న ఫొటోను ఎక్స్ వేదికగా గురువారం పోస్టు చేసిన కేటీఆర్.. ‘దీన్ని ఫ్రేమ్ కట్టించుకుంటావో.. మెడలో వేసుకుని ఊరేగుతావో నీఇష్టం’ అని ఎద్దేవా చేశారు. ‘బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేశావ్.
అందరి కడుపునింపే అన్నదాతను పాదరక్షల పాల్జేసిన పాపం ఊరికే పోదు’ అని సీఎంను ఉద్దేశించి కేటీఆర్ హెచ్చరించారు. మూసీనది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలసొమ్మును దోచుకోవడానికి సిద్థమవుతోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మూసీ అభివృద్థికి రూ.16 వేలకోట్లతో మాస్టర్ప్లాన్ తయారుచేేస్త, కాంగ్రెస్ ప్రభుత్వం దాని అంచనాలను రూ.1.50లక్షల కోట్లకు పెంచి భారీ దోపిడీకి తెర లేపిందన్నారు. ఈ ప్రజాధనం దోపిడీని ముమ్మాటికీ ఎండగట్టి, ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.