MP Lakshman: టీటీడీలో అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:31 AM
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నట్టు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
బాధ్యులను కఠినంగా శిక్షించాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తిరుమల, జూలై3(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నట్టు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. గత టీటీడీ బోర్డు హయాంలో ఆయుర్వేద మందుల తయారీ కోసం రూ.3.90 కోట్ల వ్యయంతో నాశిరకం యంత్రాలు కొనుగోలు చేశారని, కనీసం అవి ఉపయోగంలోకి రాలేదని తెలిపారు.
పరకామణి, ఆయుర్వేద ఫార్మశీ, లడ్డూ కల్తీ.. చివరికి అన్నప్రసాదాన్ని కూడా నాశిరకంగా అందించారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇప్పటికే గత పాలకులను దేవుడు కఠినంగా శిక్షిస్తున్నాడు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను’ అని లక్ష్మణ్ తెలిపారు.