Aleti Maheshwar Reddy: మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రే అడ్డు
ABN , Publish Date - May 17 , 2025 | 04:16 AM
మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నారని బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. సీఎంకు భట్టి విక్రమార్కతో విభేదాలున్నాయని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భట్టి ఏమీ స్పందించకుండా మౌనంగా ఉన్నారన్నారు.
రేవంత్రెడ్డి-భట్టికి మధ్య విభేదాలు..
ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి పథకాలు, ఉద్యోగుల బకాయిలు ఎగ్గొట్టేందుకు ప్లాన్
మంత్రిమండలి రెండుగా చీలిపోయింది
రాహుల్ వద్ద ‘రేవంత్ ఫైలు’.. త్వరలో కీలక నిర్ణయం :ఏలేటి
హైదరాబాద్, మే 16(ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నారని బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. సీఎంకు భట్టి విక్రమార్కతో విభేదాలున్నాయని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భట్టి ఏమీ స్పందించకుండా మౌనంగా ఉన్నారన్నారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో ఏలేటి చిట్చాట్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిలు నిలిపేయాలని ప్రభుత్వం యత్నిస్తోందని.. అయితే, ఈ నిర్ణయాన్ని మంత్రివర్గంలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. దీంతో మంత్రిమండలి రెండుగా చీలిపోయింద న్నారు. ‘మంత్రివర్గంలో తనను వ్యతిరేకించే మంత్రులే ఎక్కువ ఉన్నారని భావిస్తున్న సీఎం రేవంత్.. తన పక్షానికి మంత్రి పదవులిచ్చే అవకాశం లేకపోవడంతో కావాలనే విస్తరణను అడ్డుకుంటున్నారు.
విస్తరణ జరిగితే తన వద్ద ఉన్న కీలక శాఖలపై పట్టు కోల్పోవచ్చన్న భయంతోనే అందుకు అంగీకరించడం లేదు. బీసీలకు పనికిరాని శాఖలు ఇచ్చారు’ అని ఆరోపణలు గుప్పించారు. సీఎం కొన్ని శాఖల్లో జోక్యం చేసుకోవడం.. సీనియర్ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోందని.. ముఖ్యంగా భూముల వ్యవహారంలో సీఎంకు, రెవెన్యూ మంత్రికి మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ను పలకరించకపోవడం, రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగా విమర్శించడం కూడా పార్టీలో అంతర్గత కలహాలకు నిదర్శనమన్నారు. అంతిమంగా రేవంత్పై వస్తోన్న అనేక ఆరోపణల ఫైలు ప్రస్తుతం రాహుల్ వద్ద ఉందని, త్వరలో ఆ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వ్యాఖ్యానించారు.
మహేశ్వర్రెడ్డి జ్యోతిషం చెప్పుకుంటే మంచిది: అడ్లూరి లక్ష్మణ్
బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి రాజకీయాలు వదిలేసి జ్యోతిషం చెప్పుకుంటే మంచిదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ విమర్శించారు. రెండు నెలలకోసారి ఊహకు అందని కథలు, ఊకదంపుడు సోది చెబుతున్న ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏం జరుగుతున్నది మాత్రం తెలియదన్నారు. జ్యోతిష్యం పైన అంత పట్టు ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది... ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలోనే కొనసాగుతారా లేదా అన్నది చెప్పాలని వ్యాఖ్యానించారు.