BC Welfare: బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:22 AM
బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
బీసీ కవులు, కళాకారులు ఒక్కటి కావాలి: జాజుల
బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక
పంజాగుట్ట, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక పేరుతో విస్తృతస్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బీసీ కవులు, కళాకారులు ఒక్కటవ్వాలన్నారు. ఈ సందర్భంగా వారు బీసీ కల్చరల్ ఫోరం వేదికను ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర మినరల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ వి. చిన్నశ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
బీసీల గురించి అత్యుత్తమ పాట రాసిన వారికి రూ.5 లక్షలు, రెండో పాటకు రెండు లక్షలు, మూడో అత్యుత్తమ పాటకు లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేస్తానని వి.చిన్న శ్రీశైలం యాదవ్ ప్రకటించారు. అనంతరం బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గాన్ని జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కోదారి శ్రీను, ఉపాధ్యక్షులుగా అభినయ శ్రీనివాస్, అంబటి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న, కోశాధికారిగా రామలింగం ఎన్నికయ్యారు.