Bandi Sanjay Comments: నేను నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. కేసీఆర్, కేటీఆర్ జీవితాంతం జైల్లోనే..
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:25 PM
Bandi Sanjay Comments: సొంత పార్టీ నేతలపై కేసీఆర్కు నమ్మకం లేదని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల అందరి ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు. తాను నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. తండ్రీ కొడుకులు ఇద్దరూ జీవితాంతం జైల్లోనే ఉంటారంటూ మండిపడ్డారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ నేతలందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలపై కేసీఆర్కు నమ్మకం లేదన్నారు. తాను నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. తండ్రీ కొడుకులు ఇద్దరూ జీవితాంతం జైల్లోనే ఉంటారంటూ మండిపడ్డారు. మావోయిస్టు సానుభూతిపరులమంటూ తన పేరును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పోలీసుల లిస్టులో చేర్చారని చెప్పారు.
శనివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ నేతలకు సిగ్గుంటే పార్టీ నుంచి బయటకు రావాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ ఎందుకు జరపడం లేదు?. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ ఇస్తే కొల్లిక్కి వస్తుంది. రాధాకిషన్ వాంగ్మూలంలో కేసీఆర్ పేరు ఉంది. విచారణ కోసం కేసీఆర్ను ఎందుకు పిలవడం లేదు?. ఫోన్ ట్యాపింగ్పై తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధం. ట్యాపింగ్ చేయలేదని కుటుంబ సభ్యులపై కేటీఆర్ ప్రమాణం చేయాలి. నేను కూడా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తా. ఏ గుడికి రమ్మంటారో టైమ్, డేట్ చెప్పండి. కేటీఆర్ లీగల్ నోటీసులకు నేను భయపడను’ అని అన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. తాజాగా, బండి సంజయ్కి లీగల్ నోటీసు పంపించారు. రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రికి కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దులు దాటాయన్నారు. చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం ఆయనకు కొత్త కాదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
ఇది ఇండియానేనా.. భారతీయ దస్తులు వేసుకుంటే ఇంత దారుణమా..
రాఖీ పండుగ రోజు అద్భుతమైన గిఫ్ట్.. అన్నకు ప్రాణ దానం..