Siddipet: తెలంగాణ జవాన్ పంజాబ్లో అదృశ్యం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:37 AM
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ తోట అనిల్ కనబడకుండా పోయారు.
సెలవుల తర్వాత డ్యూటీలో చేరిన రోజే ఘటన
చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు ఫోన్
కొమురవెల్లి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ తోట అనిల్ కనబడకుండా పోయారు. పంజాబ్లోని అంబలాలో 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అనిల్కు ఇటీవలే ప్రమోషన్ రావడంతో జూలైలో సికింద్రాబాద్ ఆర్మీక్యాంప్ శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అనంతరం సెలవులో స్వగ్రామానికి వచ్చి 18 రోజులున్నాక ఈ నెల 8న అంబలాకు వెళ్లి తిరిగి విధుల్లో చేరారు. అదే రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పి స్విచ్చాఫ్ చేశారు.
కుటుంబ సభ్యులు ఆర్మీ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పగా వారు అనిల్ డ్యూటీలో ఉన్నారని, ఆందోళన చెందవద్దన్నారు. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో అక్కడి ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అనిల్ కనపడటం లేదంటూ సమాచారమిచ్చారు. దీంతో ఏం జరిగిందోనని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో సిద్దిపేట సీపీకి ఫిర్యాదు చేశారు.