Online Betting: బెట్టింగ్ యాప్లకు యువకుడి బలి
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:48 AM
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలైన ఘటన సికింద్రాబాద్లోనిబోయినపల్లి పరిధిలో జరిగింది. స్థానిక బాపూజీనగర్ బస్తీలో నివాసముంటున్న కిరణ్గౌడ్(32) కొన్నాళ్లుగా తన స్నేహితులతో కలిసి బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డాడు.
బోయినపల్లి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలైన ఘటన సికింద్రాబాద్లోనిబోయినపల్లి పరిధిలో జరిగింది. స్థానిక బాపూజీనగర్ బస్తీలో నివాసముంటున్న కిరణ్గౌడ్(32) కొన్నాళ్లుగా తన స్నేహితులతో కలిసి బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ల కోసం కొంతమంది వద్ద అప్పులు చేశాడు. అంతటితో ఆగకుండా స్నేహితుల ద్విచక్ర వాహనాలను తీసుకువెళ్లి వారికి తెలియకుండా తాకట్టుపెట్టి వచ్చిన సొమ్మును కూడా బెట్టింగ్ యాప్లో పెట్టేవాడు. ఈ నేపథ్యంలో మొత్తం సొమ్మును పొగొట్టుకుని అప్పుల పాలయ్యాడు.
ద్విచక్రవాహనాల దొంగిలింపు విషయంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయు. వాటితో పాటు తన అప్పు తీర్చకపోవడంతో ఓ స్థానిక మహిళ కిరణ్గౌడ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనోవేదన చెంది మూడు రోజుల క్రితం మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కిరణ్గౌడ్ మృతికి సదరు మహిళ ఒత్తిడే కారణమంటూ అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బస్తీలో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిని త్వరలో పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఎస్సై శివశంకర్ పేర్కొన్నారు.