Share News

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:01 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతల పెట్టిన విమానాశ్రయానికి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకుంది.

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

  • త్వరలోనే కేంద్రానికి నివేదిక

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతల పెట్టిన విమానాశ్రయానికి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకుంది. త్వరలోనే కేంద్రానికి నివేదిక చేరనున్నట్టు తెలిసింది. పాల్వంచ సమీపంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 950 ఎకరాల అటవీ భూములను కేటాయించింది. అయితే అక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, విమానాశ్రయ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధ్యయనం నిర్వహిస్తోంది.


పదేళ్ల వాతావరణ నివేదికలను పరిశీలించి, సమగ్ర నివేదిక తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. కాగా, ఇప్పటికే వరంగల్‌ జిల్లా మామునూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రిలో ఏర్పాటు చేయదలచిన విమానాశ్రయంపై దృష్టి సారించింది. ఇందుకోసం కేంద్రంతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతోంది. ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు.

Updated Date - Mar 15 , 2025 | 05:01 AM