BRS: తెలంగాణ భవన్లో అసాంఘిక కార్యకలాపాలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:00 AM
బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో అసాంఘిక, అప్రజాస్వామిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆరోపించారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: సంపత్ కుమార్
హైదరాబాద్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో అసాంఘిక, అప్రజాస్వామిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఓ టీవీ చానల్ను అక్రమంగా నిర్వహిస్తున్నారని, ఆ చానల్లో పని చేసే యాంకర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. మహాన్యూస్ చానల్ కార్యాలయంపై దాడి చేసిన వందలాది మంది.. తెలంగాణ భవన్లోకే వెళ్లి తలదాచుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ భవన్ను వెంటనే స్వాధీనం చేసుకుని, సీసీ ఫుటేజీల ఆధారంగా అసాంఘిక శక్తులను గుర్తించాలన్నారు. ఆ పార్టీ ఖాతాల్లోకి రూ.వేల కోట్లు ఎలా వచ్చాయన్న దానిపైనా విచారణ జరపాలన్నారు. గత 20 ఏళ్లలో తెలంగాణ భవన్లో జరిగిన అక్రమాలపై ఫైలు తయారు చేశామని, త్వరలోనే సీఎం రేవంత్రెడ్డికి ఇస్తామని చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డికి మైండు కరాబైందని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదని దుయ్యబట్టారు.