ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:33 PM
రామగుండం పోలీసు కమిషనరేట్లో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు.
-రామగుండం సీపీ శ్రీనివాస్
మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీసు కమిషనరేట్లో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 21 లొకేషన్లలో 58పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. అన్నీ పోలింగ్ స్టేషన్లకు నంబర్ మార్క్, వెబ్ కాస్టింగ్ జియో ట్యాగింగ్ పూర్తి చేశామన్నారు. 19రూట్ మొబైల్స్, 17స్ర్టైకింగ్ ఫోర్స్, 5 స్పెసల్ స్ర్టైకింగ్ ఫోర్స్, 7ఎఫ్ఎస్టీ, వీఎస్టీ టీములు ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం 78 పోలీసు అధికారుల సిబ్బందితో పాటు 560 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 28వ తేదీ ఉదయం 8గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100మీటర్ల చుట్టూ ఈ సెక్షన్ అమలులో ఉంటుందని, ఐదుగురు కానీ, అంతకన్నా ఎక్కువ మంది గుంపుగా తిరగవద్దన్నారు. ఊరేగింపులు, ధర్నాలు నిషేధం అని తెలిపారు. ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని సూచించారు.
- ఈ నెల 27న జరుగనున్న ఉపాద్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. భద్రత పరంగా చేపట్టవలిసిన ఏర్పాట్లను అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం
- డీసీపీ భాస్కర్
నస్పూర్ (ఆంధ్రజ్యోతి): ప్రశాంతమైన వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహణే లక్ష్యమని మంచిర్యాల డీపీసీ భాస్కర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా మంగళవారం నస్పూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో మంగళవారం పోలీస్ అధికారులు, సిబ్బంది సమావేశం జరిగింది. ఈ నెల 27న జరుగనున్న పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద, ఇతర డ్యూటీలు, రూల్ మోబైల్స్ ఇన్చార్జి అధికారులకు సూచనలు సలహాలను ఇచ్చారు. డీఆర్సీ సెంటర్ నుంచి బ్యాలెట్లు పోలింగ్ స్టేషన్కు చేరే వరకు తిరిగి పోలింగ్ ముగిసి డీఆర్సీకి చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.