Kumaram Bheem Asifabad: డయాలిసిస్ కేంద్రంతో.. తీరిన కష్టాలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:14 PM
కాగజ్నగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కిడ్నీ చెడిపోయిన నిరుపేదల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలిసిస్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపతున్నాయి.

కాగజ్నగర్లో ప్రభుత్వాసుపత్రిలో డయాలిస్ సెంటర్లో చికిత్సలు పొందుతున్న కిడ్నీ చెడిపోయిన బాఽధితులు
-పెరుగుతున్న డయాలిసిస్ పెషెంట్లు
-మరో రెండు మిషన్లు వస్తే మరింత ఉపయోగం
-నివేదికలు పంపించిన అధికారులు
కాగజ్నగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కిడ్నీ చెడిపోయిన నిరుపేదల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలిసిస్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపతున్నాయి. జిల్లాలో కాగజ్నగర్, ఆసిఫాబాద్ డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు గంటలకు ఒకరి చొప్పున ఈ కేంద్రాల్లో డయాలసిస్ చేస్తున్నారు. ఐదు డయాలిస్ మిషన్లతో 2023న అప్పటి ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. ప్రతిరోజు ఆసిఫాబాద్, కాగజ్నగర్ కేంద్రాల్లో సిబ్బంది 40మంది డయాలసిస్ పేషేంట్లకు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు అందటంపై ఈ ప్రాంత నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోజురోజుకూ కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రతికేంద్రంలో మరో రెండు డయాలిస్ మిషన్లను ఏర్పాటు చేస్తే అదనంగా సేవలు అందించే అవకాశాలున్నాయి. ఈ రెండు కేంద్రాల్లో ఉన్నవాటితోనే సేవలు అందిస్తున్నప్పటికీ అవి రోగులకు సరిపడక పోవడం లేదు. కొందరు ప్రయివేటు ఆసుపత్రిల్లో డయాలిస్ చేసుకుంటున్నారు. ప్రైవేటులో ఒక్కసారి డయాలిస్ చేసుకుంటే రూ.8నుంచి రూ.10వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని బాధితులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఖాళీ బెడ్ ఉంటేనే డయాలసిస్ చేసేందుకు అనుమతి ఉంది. మరిన్ని మిషన్లను మంజూరు చేయాలని అధికారులకు నివేదికలను ఉన్నతాధికారులకు పంపించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అనుమతులు రాలేదు. ప్రస్తుతం వస్తున్న రోగులకు మాత్రం ఉమ్మడి జిల్లాలో ఉన్న కేంద్రాల్లో సర్దుబాటు చేస్తున్నారు. జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఐదు షిప్టుల వారీగా సిబ్బంది కీలకమైన సేవలు అందిస్తున్నారు. డయాలసిస్ చేస్తున్న సమయంలో అత్యవసర పరిస్థితి వస్తే మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స పొందాలంటే తప్పకుండా ఆరోగ్య శ్రీకార్డు, ప్రభుత్వ వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం ఉండాల్సి ఉంటుంది. ఆయా వివరాలు ఖచ్చితంగా ఉండి బెడ్స్ ఖాళీ ఉంటేనే డయాలసిస్కు అనుమతి ఇస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికి బెడ్ ఖాళీ కాగానే సమాచారం అందించి సేవలను అందిస్తున్నారు.
ఉన్నతాధికారులకు సమాచారం అందించాం..
- చెన్నకేశవ్రావు, సూపరింటెండెంట్
డయాలసిస్ కేంద్రాల్లో మరో రెండుమిషన్లు ఏర్పాటు చేయాలని నివేదికలు పంపించాం. ప్రస్తుతం ఉన్న వాటితోనే సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మూడు షిఫ్ట్లలక్ష డయాలసిస్ చేస్తున్నాం.