Health Services: 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:16 AM
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, జర్నలిస్టు, ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిపి వేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్హెచ్ఏ) ప్రకటించింది
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు నెట్వర్క్ ఆస్పత్రుల లేఖ
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, జర్నలిస్టు, ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిపి వేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్హెచ్ఏ) ప్రకటించింది. బకాయిల చెల్లింపులో జాప్యం, ఆర్థిక భారం పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్హెచ్ఏ తెలిపింది. ఈ మేరకు గురువారం ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ రాసిన టీఏఎన్హెచ్ఏ... జనవరిలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.1,300-1,400 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
బకాయిలు గణనీయంగా పెరగడంతో చిన్న, మధ్య తరగతి ఆస్పత్రులను మూసివేసుకునే పరిస్థితి నెలకొందని టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను 4-5 నెలల్లో చెల్లిస్తామని, ప్యాకేజీలను సవరిస్తామని మంత్రి ఇచ్చిన హామీ, ఆరు నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని లేఖలో పేర్కొన్నారు.