Kishan Reddy: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి రూ.303 కోట్లు
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:20 AM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.303 కోట్లు వెచ్చించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంగీకారం..
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అంగీకారం: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.303 కోట్లు వెచ్చించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంగీకారం తెలిపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కంటోన్మెంట్ పరిధిలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్లు, అభివృ ద్ధి పనుల కోసం ఎస్ర్కౌ అకౌంట్ (ఏ పనులకైతే నిధులను జమ చేస్తారో ఆ పనులకు మాత్రమే ఆ నిధులను ఉపయోగించుకునేలా)ను ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రికి తాను రెండుసార్లు లేఖలు రాశానని వెల్లడించారు. ఈ అకౌంట్కు రూ.303.62 కోట్ల భూబదిలీ పరిహారాన్ని జమ చేయాలని కోరానని తెలిపారు. దీంతో రక్షణ శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. రక్షణ శాఖ భూములకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన భూబదిలీ పరిహారాన్ని ఎస్ర్కౌ అకౌంట్లో జమ చేసిన వెంటనే కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాలని రక్షణ శాఖ ఆదేశాల్లో పేర్కొందని కిషన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.