BSF: ‘ఆపరేషన్ సిందూర్’ వీరులకు శౌర్య పతకాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:19 AM
ఆపరేషన్ సిందూర్ సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు, అసమాన శౌర్యపరాక్రమాలు ప్రదర్శించిన 16 మంది సరిహద్దు భద్రతా దళం (బీఎ్సఎఫ్) జవాన్లకు శౌర్య పతకాలు లభించాయి.
16 మంది బీఎ్సఎఫ్ జవాన్లకు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఆపరేషన్ సిందూర్ సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు, అసమాన శౌర్యపరాక్రమాలు ప్రదర్శించిన 16 మంది సరిహద్దు భద్రతా దళం (బీఎ్సఎఫ్) జవాన్లకు శౌర్య పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ దళాలకు పురస్కారాలు ప్రకటించింది. సరిహద్దుల్లోని వేర్వేరు పోస్టుల్లో విధులు నిర్వర్తించిన సబ్ ఇన్స్పెక్టర్ వ్యాస్ దేవ్, కానిస్టేబుల్ సుద్ది రభా, అసిస్టెంట్ కమాండెంట్ అభిషేక్ శ్రీవాస్తవ్, హెడ్ కానిస్టేబుల్ బ్రిజ్ మోహన్ సింగ్, కానిస్టేబుళ్లు భూపేంద్ర బాజ్పాయ్, రాజన్ కుమార్, బసవరాజ శివప్ప సుంకడ, దేపేశ్వర్ బర్మన్, డిప్యూటీ కమాండెంట్ రవీంద్ర రాథోడ్, ఇన్స్పెక్టర్ దేవీ లాల్, హెడ్ కానిస్టేబుల్ సాహిబ్ సింగ్, కానిస్టేబుల్ కన్వరాజ్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ వీర్ సింగ్, ఏఎ్సఐ రాజప్ప, కానిస్టేబుల్ మనోహర్ క్సాల్క్సో, అసిస్టెంట్ కమాండెంట్ అలోక్ నేగి అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో కొందరు పాక్ డ్రోన్లను కూల్చివేయగా, మరికొందరు శత్రు దేశ నిఘా వ్యవస్థలను ధ్వంసం చేశారు. గాయపడిన సహచరులను రక్షించారు. కాగా, వివిధ ఆపరేషన్లలో పాల్గొన్న ఇతర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బందికి కూడా శౌర్య పతకాలు ప్రకటించింది. వీరిలో జమ్మూ కశ్మీర్ పోలీసులు 128 మంది, 20 మంది సీఆర్పీఎఫ్, ఛత్తీ్సగఢ్ పోలీసులు 14 మంది ఉన్నారు.
1,090 మందికి పోలీసు మెడల్స్
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 1,090 మంది పోలీసు సిబ్బందికి కేంద్రం సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. 233 మందికి గ్యాలంట్రీ పతకాలు(జీఎం), 99 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(పీఎ్సఎం), 758 మందికి పోలీసు విశిష్ఠ సేవా (ఎంఎ్సఎం) పతకాలను ప్రకటించింది. శౌర్య పతకాలు పొందిన వారిలో జమ్మూ కశ్మీర్ నుంచి అత్యధికంగా 152 మంది ఉండగా, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న 54మందికి, ఇతర ప్రాంతాలకు చెందిన 27 మందికి అవార్డులు ఇవ్వనుంది.