Shreyasi Singh: బిహార్ మంత్రిగా శ్రేయసి సింగ్.. ఇంతకీ ఎవరీమె..?
ABN , Publish Date - Nov 20 , 2025 | 02:02 PM
బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె సీనియర్ షూటర్ కావడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్లో గురువారం ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది శ్రేయసి సింగ్(Shreyasi Singh). ఇంతకీ ఆమె ఎవరంటే?
శ్రేయసి సింగ్, 1991 ఆగష్టు 29న బిహార్లోని గిఢౌర్ గ్రామంలో జన్మించారు. ఆమె భారతీయ క్రీడా రంగంతోపాటు బిహార్ రాజకీయాల్లో ప్రఖ్యాతి పొందారు. ఆమె ఒక అగ్రశ్రేణి షూటర్. 2020లో బీజేపీలో చేరిన శ్రేయసి ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలోని జమూయి నియోజకవర్గం పోటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి షంషాద్ను ఓడించి 1,23,868 ఓట్లతో విజయం సాధించారు.
కేంద్ర మాజీ మంత్రి కూతురే..
శ్రేయసి కుటుంబంలో అందరూ రాజకీయాలకు సంబంధించిన వారే. ఈమె కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. శ్రేయసి తల్లి పుతుల్ కుమారీ ఎంపీగా పని చేశారు. ఆమె తాత, తండ్రి ఇద్దరూ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో కీలక పదవుల్లో సేవలందిస్తున్నారు. ఈ విజయపథం ఆమెను క్రీడా ప్రపంచంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ ప్రముఖ నాయకురాలిగా నిలిపింది.
టాప్ షూటర్..
శ్రేయసి సింగ్ అంతర్జాతీయ స్థాయిలో ట్రాప్ షూటింగ్ విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో రజత పతకం, 2018 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఆమె చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి