Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత డాక్టర్ను రిషభ్ పంత్ అడిగిన తొలి ప్రశ్న అదేనట..
ABN , Publish Date - Jun 30 , 2025 | 09:19 AM
రిషభ్ పంత్కు గతంలో ఓ భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి కాపాడారు.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో అదరగొడుతున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేశాడు. ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. పంత్కు గతంలో ఓ భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి కాపాడారు (Rishabh Pant Accident).
యాక్సిడెంట్ అయి హాస్పిటల్కు తీసుకెళ్లగానే డాక్టర్ను చూసిన పంత్.. 'నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా' అని ప్రశ్నించాడట. ఈ విషయాన్ని పంత్కు చికిత్స అందించిన డాక్టర్ దిన్షా పార్దీవాలా తెలిపారు. పంత్కు జరిగిన ఘోరమైన యాక్సిడెంట్ గురించి దిన్షా వెల్లడించారు. 'హాస్పిటల్కు తీసుకొచ్చే సమయానికి పంత్ కుడి మోకాలు భాగం పక్కకు జరిగిపోయింది. కుడి చీలమండకు కూడా పెద్ద గాయం అయింది. అతడి శరీరంలో పలు చోట్ల గాజు పెంకులు ఉన్నాయి. చర్మం చీరుకుపోయింది అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్కు వచ్చిన పంత్.. 'నేను మళ్లీ ఆడగలానా' అని అడిగాడు' అని డాక్టర్ గుర్తు చేసుకున్నారు.
'అంత పెద్ద ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాదంలో అతడి రక్తనాళాలు దెబ్బతినలేదు. దీంతో ప్రధాన అవయవాలకు ఇబ్బంది కలగలేదు. మోకాలికే పెద్ద దెబ్బ తగిలింది. చర్మం బాగా చీరుకుపోవడంతో కదలడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. బ్రష్ చేయడానికి కూడా చాలా కష్టపడేవాడు. పంత్ మోకాలికి సర్జరీ చేసి నాలుగు లిగ్మెంట్లను అమర్చాం' అని డాక్టర్ తెలిపారు. దాదాపు రెండేళ్లు విశ్రాంతి తీసుకున్న పంత్ 2024లో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి