Share News

New Era in Indian Cricket: వన్డేల్లోనూ గిల్‌ శకం

ABN , Publish Date - Oct 05 , 2025 | 06:01 AM

భారత క్రికెట్‌ జట్టులో ఇక నయా శకం ఆరంభం కాబోతోంది. వన్డే ఫార్మాట్‌కు కూడా కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. ఆస్ట్రేలియాలో పర్యటన కోసం శనివారం భారత వన్డే, టీ20 జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. ఇందులో...

New Era in Indian Cricket: వన్డేల్లోనూ గిల్‌ శకం

నాయకుడిగా రోహిత్‌కు ఉద్వాసన

  • కోహ్లీ కూడా వచ్చేశాడు

  • వైస్‌ కెప్టెన్‌గా శ్రేయాస్‌

  • బుమ్రాకు విశ్రాంతి

ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా జట్టులో ఆటగాడిగా కొనసాగింపు

అహ్మదాబాద్‌: భారత క్రికెట్‌ జట్టులో ఇక నయా శకం ఆరంభం కాబోతోంది. వన్డే ఫార్మాట్‌కు కూడా కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. ఆస్ట్రేలియాలో పర్యటన కోసం శనివారం భారత వన్డే, టీ20 జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. ఇందులో ఊహించని రీతిలో వన్డే జట్టు పగ్గాలు సైతం యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కే దక్కాయి దీంతో సక్సె్‌సఫుల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న వెటరన్‌ రోహిత్‌ శర్మ ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ను ఎంపిక చేశారు. 2027లో వన్డే వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు కెప్టెన్సీ మార్పు చేశారు. ఈ ఏడాదే రోహిత్‌ నుంచి గిల్‌ టెస్టు బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 19 నుంచి 25 వరకు సిడ్నీ, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌లలో 3 వన్డేలు జరుగుతాయి. అయితే రోహిత్‌తోపాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా జట్టుతో కలువనున్నాడు. ఈ ద్వయం గత మార్చిలో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో చివరిసారి ఆడారు. ఇప్పటివరకు 55 వన్డేలు ఆడిన గిల్‌.. 8 సెంచరీలతో 2,775 పరుగులు సాధించాడు. మరోవైపు సీనియర్‌ పేసర్‌ బుమ్రాకు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. కానీ అక్షర్‌, కుల్దీప్‌, సుందర్‌ల రూపంలో ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేసిన సెలెక్టర్లు ఈసారి ఆల్‌రౌండర్‌ జడేజాపై వేటు వేశారు. జట్టు సమతూకంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ఇద్దరు ఎడమచేతి స్పిన్నర్లు అవసరం లేదని భావించినట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశాడు. వన్డే జట్టు ప్రణాళికల్లో మాత్రం జడ్డూ ఉంటాడని తేల్చాడు. పేస్‌ విభాగంలో సిరాజ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌, హర్షిత్‌ ఉన్నారు. ఇక టీ20ల్లో నిలకడ ప్రదర్శిస్తున్న జైస్వాల్‌కు వన్డేల్లో చోటు కల్పించారు. కెరీర్‌లో అతను ఒక్క వన్డేనే ఆడాడు.


హార్దిక్‌ స్థానంలో నితీశ్‌: ఆసియాకప్‌ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్‌ సూర్యకుమార్‌కే టీ20 పగ్గాలు అప్పగించారు. బ్యాటర్‌గా అతను విఫలమైనా,సెలెక్టర్లు అతడి నాయకత్వ ప్రతిభపై నమ్మకముంచారు. ఆసీ్‌సతో ఈనెల 29 నుంచి నవంబరు 8 వరకు ఐదు టీ20ల సిరీస్‌ జరుగుతుంది. దాదాపుగా ఆసియాక్‌పలో పాల్గొన్న జట్టునే ఆసీస్‌ పర్యటనకు ఎంపిక చేశారు. అయితే గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ కుమార్‌ను తీసుకున్నారు. నితీశ్‌ అటు వన్డే జట్టులోనూ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక అదనపు స్పిన్నర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ కూడా జట్టులోకి వచ్చాడు.

వన్డే జట్టు

గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌, కోహ్లీ, శ్రేయాస్‌ (వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్‌, అక్షర్‌, రాహుల్‌, నితీశ్‌, సుందర్‌, కుల్దీప్‌, హర్షిత్‌, సిరాజ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌, జురెల్‌.

టీ20 జట్టు

సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్‌, గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), తిలక్‌, నితీశ్‌ కుమార్‌, దూబే, అక్షర్‌, జితేశ్‌, శాంసన్‌, వరుణ్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌, హర్షిత్‌, రింకూ సింగ్‌, సుందర్‌.

ఎందుకిలా..?

టెస్టు జట్టుతో పాటు వన్డే పగ్గాలు కూడా రోహిత్‌ నుంచి చేజారాయి. ఈ ఏడాది మార్చిలో అతని ఆధ్వర్యంలోనే జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గింది. గతేడాది టీ20 వరల్డ్‌క్‌పను కూడా అందించాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో జట్టును ఫైనల్‌ చేర్చాడు. అయినా ఈ అనుభవశాలిని కాదని, వెస్టిండీ్‌సపై తొలి టెస్టులో భారత్‌ గెలిచిన గంటలోపే వన్డే కొత్త కెప్టెన్‌ పేరును సెలెక్టర్లు ప్రకటించారు. రోహిత్‌ కెప్టెన్‌గా 56 వన్డేల్లో 42 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. సారథిగా అతడి విజయాలశాతం 76 కావడం విశేషం. కానీ ఇంగ్లండ్‌ పర్యటనలో గిల్‌ జట్టును నడిపించిన తీరు సెలెక్టర్లను ఆకట్టుకుంది. గిల్‌ సారథిగానే గాకుండా బ్యాటర్‌గానూ విజృంభించాడు. ఇప్పటికే రోహిత్‌ టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేలకే పరిమితమయ్యాడు. ఇక, మూడు ఫార్మా ట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించడం ఆచరణయోగ్యం కాదని బీసీసీఐ భావిస్తోం దట. అందుకే 2027 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈలోపు కెప్టెన్‌గా గిల్‌కు తగినంత సమయం ఇచ్చి విశ్వకప్‌ నకు సిద్ధం చేయాలని బోర్డు అనుకుం టోంది. మరోవైపు నాయకత్వ మార్పు గురించి రోహిత్‌తో ముందుగానే చర్చించామని చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌ తెలిపాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated Date - Oct 05 , 2025 | 06:01 AM