BCCI Decision: వారం పాటు ఐపీఎల్ వాయిదా
ABN , Publish Date - May 10 , 2025 | 04:18 AM
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ సీజన్ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. విదేశీ ఆటగాళ్ల భద్రతా ఆందోళనలతో ఆటలు నిలిపివేసిన బోర్డు, పరిస్థితి సద్దుమణిగేంతవరకు తుది నిర్ణయం తీసుకోనుంది.

దేశ భద్రతే ముఖ్యమన్న బీసీసీఐ
వినోదానికి విరామం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఐపీఎల్ 18వ సీజన్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇరు దేశ సరిహద్దుల దగ్గర భీకర దాడులు సాగుతుండడంతో ఆటగాళ్ళ భద్రత ముఖ్యమని బోర్డు భావిస్తోంది. గురువారం ధర్మశాల వేదికలో పంజాబ్-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ను అర్ధంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. పొరుగు నగరాలపై పాక్ డ్రోన్ దాడులకు తెగబడడంతో ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ ప్రకటించగా, స్టేడియంలోని ఫ్లడ్లైట్లు ఆగిపోయాయి. ఆ తర్వాత ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా మైదానం వీడాల్సి వచ్చింది. అదేరోజు బీసీసీఐ ఉన్నతాధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. తిరిగి శుక్రవారం ఉదయం చైర్మన్ అరుణ్ ధూమల్ నేతృత్వంలో జరిగిన ఐపీఎల్ పాలకమండలి అత్యవసర భేటీలో లీగ్ వాయిదా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే ఈ విషయమై ఐపీఎల్ పాలకమండలిలో సుదీర్ఘంగా చర్చించాం. అలాగే ప్రసారకర్తలు, స్పాన్సరర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వెంటనే వారం రోజుల పాటు ఐపీఎల్ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది కష్టసమయం. అందుకే దేశ ప్రయోజనాలకు బీసీసీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. సాయుధ బలగాల ధైర్యం, నిస్వార్థ సేవకు మా సెల్యూట్’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నాడు. కొత్త షెడ్యూల్, వేదికలను సంబంధిత అధికారులు, ఫ్రాంచైజీలతో సంప్రదించాక, అప్పటి పరిస్థితులను అంచనా వేశాక ప్రకటిస్తామని చెప్పాడు. వాస్తవానికి ఈనెల 25న కోల్కతాలో జరిగే ఫైనల్తో ఐపీఎల్ ముగియాల్సి ఉండేది.
వారం తర్వాత జరిగేనా?
వాస్తవానికి ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. కానీ కాసేపటికే వారంరోజుల వరకే అంటూ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ తర్వాతైనా మ్యాచ్లు జరుగుతాయా? అంటే సందేహమే. ఎందుకంటే విదేశీ ఆటగాళ్లు తిరిగి భారత్లో అడుగుపెట్టేందుకు వెనుకడుగు వేయవచ్చు. ఈ ఐపీఎల్లో ఇప్పటిదాకా లీగ్ దశలో 58 మ్యాచ్లు జరిగాయి. ఇంకా 16 మ్యాచ్ (12 లీగ్+4 నాకౌట్)లు మిగిలున్నాయి. వీటిని ఎలా షెడ్యూల్ చేస్తారనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణిగేదాకా మ్యాచ్లు జరగకపోవచ్చు. షెడ్యూల్ ప్రకారం మే 25న లీగ్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమిండియా.. జూన్లో జరిగే 5 టెస్టుల కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. ఆ సిరీ్సను మార్చే వీలుండదు కాబట్టి ఆ తర్వాతే.. అంటే ఆగస్టులోనే మిగిలిన లీగ్ మ్యాచ్లను నిర్వహించవచ్చు. కానీ ఆ నెలలో ది హండ్రెడ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా సిరీస్సలున్నాయి. దీంతో విదేశీ ఆటగాళ్లకు ఇబ్బంది. ఇక సెప్టెంబరులో భారత్లో ఆసియా కప్ జరగాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ టోర్నీ జరగకపోవచ్చు. కాబట్టి సెప్టెంబరులో ఐపీఎల్ మిగతా మ్యాచ్లను నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడు కేవలం ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ఉంటుంది. ఐపీఎల్ కోసం ఆటగాళ్ల విడుదలపై బీసీసీఐ చర్చలు జరపవచ్చు.
ప్రత్యేక ‘వందే భారత్’ రైలులో ఢిల్లీకి..
ధర్మశాల విమానాశ్రయం మూసివేతతో అక్కడి నుంచి పంజాబ్, ఢిల్లీ జట్ల ఆటగాళ్ల తరలింపు మొదట సమస్యగా మారింది. చివరకు ప్రత్యేక రైలులో వీరందరినీ న్యూఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. దీంతో శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి 40-50 వరకు చిన్నపాటి వాహనాల్లో ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, బ్రాడ్కాస్ట్ సిబ్బందిని కట్టుదిట్టమైన భద్రత మధ్య హోషియార్పూర్కు తరలించారు. అక్కడినుంచి జలంధర్ చేరాక.. ప్రత్యేక ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలులో ప్రయాణించి అందరూ ఢిల్లీ చేరుకున్నారు.
భారత్ను వీడనున్న విదేశీ క్రికెటర్లు
భారత్-పాక్ మధ్య యుద్ధం సాగుతుండడంతో ఐపీఎల్, పీఎ్సఎల్లోని తమ ఆటగాళ్ల భద్రతపై దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈమేరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు లేఖలు రాశాయి. ఇక ఐపీఎల్ వాయిదా పడడంతో ఫారిన్ ప్లేయర్లు తమ స్వదేశాలకు వెళ్లనున్నారు. ఇందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత పరిణామాలతో వారు కాస్త ఆందోళనగా ఉన్నట్టు ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపాడు. మరోవైపు స్వదేశీ ఆటగాళ్లు కూడా తమ స్వస్థలాలకు వెళ్లారు.