Share News

India Womens Cricket: ఘనంగా ముగించాలని

ABN , Publish Date - Dec 30 , 2025 | 06:53 AM

ఐదు టీ20ల సిరీ్‌సలో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.. ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది. అయితే,...

India Womens Cricket: ఘనంగా ముగించాలని

రాత్రి 7 గం. నుంచి

  • క్లీన్‌స్వీప్‌పై భారత్‌ దృష్టి

  • ఓదార్పు విజయం కోసం శ్రీలంక

  • మహిళల ఐదో టీ20 నేడు

తిరువనంతపురం: ఐదు టీ20ల సిరీ్‌సలో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.. ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది. అయితే, ప్రత్యర్థి శ్రీలంక మంగళవారం జరిగే ఆఖరి, ఐదో టీ20లోనైనా నెగ్గి ఓదార్పు విజయాన్ని నమోదు చేయాలనుకొంటోంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌ సన్నాహకాల కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటించనుంది. 2024 టీ20 వరల్డ్‌క్‌పలో గ్రూప్‌దశలోనే నిష్క్రమించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఆ తర్వాత పంథాను మార్చుకొని దూకుడుగా ఆడుతూ బలమైన ప్రత్యర్థిగా మారింది. ఈ సిరీ్‌సలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో.. తొలి మూడు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ అద్భుతంగా రాణిస్తోంది. అయితే, భారత ఫీల్డింగ్‌ ప్రమాణాలను అందుకోలేక పోవడం మాత్రం ఆందోళనకరం. నాలుగో టీ20లో కూడా రెండు క్యాచ్‌లతోపాటు ఓ స్టంపింగ్‌ అవకాశాన్ని చేజార్చారు. కాగా, ఏడాది తర్వాత పేసర్‌ రేణుక సింగ్‌ పొట్టి ఫార్మాట్‌లోని గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడం సానుకూలాంశం. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ నిలకడగా రాణిస్తుండగా.. ఈ సిరీ్‌సలో అరంగేట్రం చేసిన స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఆకట్టుకొంది. డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (48 బంతుల్లో 80) టచ్‌లోకి రావడం ఊరటనిచ్చే విషయం కాగా.. వన్‌డౌన్‌కు ప్రమోట్‌ అయిన రిచా ఘోష్‌ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంది. జ్వరంతో బాధపడుతున్న జెమీమా రోడ్రిగ్స్‌ ఫిట్‌నె్‌సపై ఎటువంటి సమాచారం లేదు. జట్టులోని అందరికీ అవకాశాలు లభించడంతో ఇక మిగిలిన 17 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమలి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయిన లంక.. నాలుగో మ్యాచ్‌లో ఛేదనలో దీటుగానే నిలిచింది. ఇదే ఆత్మవిశ్వాసంతో ఈ సిరీ్‌సను విజయంతో ముగించాలని చమరి ఆటపట్టు సేన పట్టుదలతో ఉంది.


జట్లు (అంచనా)

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా/హర్లీన్‌ డియోల్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌/కమలిని, దీప్తీశర్మ, అమన్‌జోత్‌ కౌర్‌, రేణుక సింగ్‌, క్రాంతి గౌడ్‌, వైష్ణవి శర్మ, శ్రీచరణి.

శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్‌), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలాక్షిక సిల్వ, కౌషిని నుత్యాంగన, కవిష దిల్హారి, మాల్కి మదార/క్వాయా కవింది, ఇనోకా రణవీర, మాల్షా షెహాని, నిమాషా మీపేజ్‌.

పిచ్‌/వాతావరణం..

వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ బౌలింగ్‌ ఎంచుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉంది.

ఇవి కూడా చదవండి

రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్

మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?

Updated Date - Dec 30 , 2025 | 06:53 AM