Harmanpreet Kaur: అడ్డంకులను అధిగమిస్తాం
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:52 AM
ఈ ఏడాది భారత్, శ్రీలంకల్లో ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే వరల్డ్కప్ జరుగబోతోంది. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు జరిగే ఈ టోర్నీ 50 రోజుల కౌంట్డౌన్తో పాటు ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా...
మహిళల వన్డే వరల్డ్కప్పై హర్మన్ప్రీత్
ముంబై: ఈ ఏడాది భారత్, శ్రీలంకల్లో ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే వరల్డ్కప్ జరుగబోతోంది. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు జరిగే ఈ టోర్నీ 50 రోజుల కౌంట్డౌన్తో పాటు ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఇందులో ఐసీసీ అధ్యక్షుడు జైషా, సీవోవో సంజోగ్ గుప్తా, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్తో పాటు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు. అయితే 1973 నుంచి జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు విజేతగా నిలువలేకపోయింది. 2005, 2017లో మాత్రం రన్నర్పగా నిలిచింది. అందుకే కెప్టెన్ హర్మన్ప్రీత్ కప్పై ధీమాను వ్యక్తపరుస్తోంది. ‘ఈసారి మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించి, భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కప్ను సాధిస్తాం. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. అలాగే యువరాజ్ను చూసి నేనెంతో ప్రేరణ పొందుతా’ అని హర్మన్ తెలిపింది.
బెంగళూరు మ్యాచ్లపై అస్పష్టత
వరల్డ్క్పలో ఐదు మ్యాచ్లకు ఆతిథ్యమివ్వాల్సిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జూన్ 4న అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా స్టేడియంలో మ్యాచ్లపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అనుమతి కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందనలేదు. ఒకవేళ అక్కడ మ్యాచ్లు జరుగకపోతే వైజాగ్, గువాహటిలకు తరలించే చాన్సుంది. అయితే పాకిస్థాన్తో పాటు కొన్ని ఇతర జట్ల మ్యాచ్లకు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.

దేశం కోసం...: యువీ
దేశం కోసం మ్యాచ్లను గెలవాలనే కసి ప్రతీ ప్లేయర్లో ఉండాలని మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సూచించాడు. ‘చరిత్ర సృష్టించేందుకు మీకిదే అద్భుత అవకాశం. కానీ ఆరంభం నుంచే అంచనాలు పెట్టుకోకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడండి. ఫలితాలు అవే వస్తాయి. మీ అనుభవంపై నమ్మకం పెట్టుకోండి. ఎలాంటి స్థితిలోనైనా దేశం కోసం గెలవాలనే తపనను వీడకండి’ అని మహిళా జట్టుకు ఉద్భోదించాడు.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..