Share News

కివీస్‌తో సులువేం కాదు!

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:32 AM

ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోనూ భారత జట్టు న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. గత ఆదివారం గ్రూప్‌ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ ఇదే జట్టుపై గెలిచిన...

కివీస్‌తో సులువేం కాదు!

ఫైనల్‌ మ్యాచ్‌కు

ఫీల్డ్‌ అంపైర్లు: పాల్‌ రీఫిల్‌ (ఆస్ర్టేలియా), రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌); మ్యాచ్‌ రెఫరీ: రంజన్‌ మదుగలే (శ్రీలంక); థర్డ్‌ అంపైర్‌: జోయల్‌ విల్సన్‌ (వెస్టిండీస్‌)

బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లోనూ సమవుజ్జీలే..

ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోనూ భారత జట్టు న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. గత ఆదివారం గ్రూప్‌ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ ఇదే జట్టుపై గెలిచిన విషయం తెలిసిందే. కానీ లాహోర్‌లో జరిగిన రెండో సెమీ్‌సలో దక్షిణాఫ్రికాపై విరుచుకుపడిన కివీస్‌ మరోసారి టీమిండియాకు సవాల్‌ విసురుతోంది. అయితే ఇదివరకే సునాయాసంగా గెలిచాం కదా అని కివీ్‌సను తేలిగ్గా తీసుకుంటే మాత్రం అసలుకే మోసం రావచ్చు. అదీగాకుండా ఆ జట్టు కూడా దుబాయ్‌లోనే ఆడింది కాబట్టి ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. వాస్తవానికి పెద్ద టోర్నీలు జరిగేటప్పుడు న్యూజిలాండ్‌ను చాలామంది ఫేవరెట్‌గా భావించరు. కానీ వారు తమ ప్రణాళికలను సరైన పద్దతిలో అమలు చేస్తూ ఊహించని విధంగా దాడి చేస్తుంటారు. అందుకే ఫైనల్లో కివీ్‌సను ఓడించడం భారత్‌కు అంత సులువేమీ కాబోదు. మనోళ్లతో పోలిస్తే వారు కూడా అన్ని విభాగాల్లో సమంగానే ఉన్నారు. స్పిన్నర్ల విషయంలో..


తాజా టోర్నీలో భారత్‌కు సమీపంలో ఉన్న జట్టేదైనా ఉంటే అది కివీస్‌ మాత్రమే. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ శాంట్నర్‌ నేతృత్వంలో బ్రేస్‌వెల్‌, ఫిలిప్స్‌, రచిన్‌ల రూపంలో బలంగానే కనిపిస్తోంది. గ్రూప్‌ మ్యాచ్‌లో వీరిపై భారత్‌ ఆధిపత్యం చూపి మ్యాచ్‌ను గెలవగలిగింది. కానీ ఈసారి దుబాయ్‌ పరిస్థితులు తెలుసు కాబట్టి పక్కా వ్యూహంతో భారత్‌ను కట్టడి చేయాలనుకుంటోంది. అలాగే కొత్త బంతితో చక్కటి సీమ్‌ను రాబట్టగల పేసర్లు అండగా ఉన్నారు. ఇందుకు వారి ఎత్తు కూడా దోహదపడుతుంది. ఈ కారణంగా బంతి ఎక్కువ సేపు గాల్లో ఉండడంతో పాటు గుడ్‌ లెంగ్త్‌లో విసరగలుగుతారు. ఐసీసీ టోర్నీల్లో కివీస్‌ పేసర్లు తమ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో భారత టాపార్డర్‌ను ఇబ్బందిపెట్టడం అలవాటే. అందుకే తొలి పవర్‌ప్లేలో వీరిని ఎదుర్కోవాలంటే భారత జట్టు ఆ మేరకు ప్రణాళికలతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

భారత్‌ మాదిరే కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా దుబాయ్‌ పిచ్‌లకు సరిపోయే విధంగా ఉంది. తమ గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ స్కోరును ఛేదించకపోయినా, వారిని తక్కువ చేయడానికి లేదు. యంగ్‌, రచిన్‌, విలియమ్సన్‌ ఆది నుంచే భారీ షాట్లకు వెళ్లకపోవచ్చు. కానీ మిడిలార్డర్‌కు చక్కటి వేదికను ఏర్పరిచేలా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడే నైపుణ్యం ఉంది. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇతర జట్లు ఇబ్బందిపడ్డాయి. అయితే లాథమ్‌, మిచెల్‌, ఫిలిప్స్‌ అలాంటి బంతులను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. దీనికితోడు ఐదు వికెట్లతో దెబ్బతీసిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌పై ఈసారి ప్రత్యేక దృష్టి సారించడం ఖాయమే. అన్నింటికన్నా ముఖ్యంగా కివీస్‌ ఫీల్డింగ్‌ ప్రమాణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. గ్లెన్‌ ఫిలి్‌ప్సను ఆఽధునిక జాంటీ రోడ్స్‌గా పిలుస్తున్నారు. మైదానంలో అతడి విన్యాసాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అతడితో పాటు యంగ్‌, బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌లను కూడా సూపర్‌ ఫీల్డర్లుగా పరిగణిస్తారు. బంతి వారి దరిదాపుల్లోకి వెళ్తే కనీసం సింగిల్‌ తీసేందుకు కూడా బ్యాటర్లు ఆలోచించాల్సి ఉంటుంది. కనీసం 30-40 పరుగులు ఫీల్డింగ్‌ ద్వారా కట్టడి చేయగలరు. అందుకే భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకోవాలంటే ఫైనల్లో కివీ్‌సను ఆషామాషీగా తీసుకుంటే కుదరదు. అంతేకాకుండా 2000లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో కివీస్‌ చేతిలోనే ఓడామన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటే మరీ మంచిది..


‘భారత్‌కు స్పష్టత ఉంటుంది’

దుబాయ్‌లోనే మ్యాచ్‌లను ఆడుతున్న భారత్‌కు పిచ్‌లపై అవగాహన ఉండడం సహజమేనని కివీస్‌ వెటరన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. క్రికెట్‌లో ఇదంతా మామూలేనని, గతంలోనూ తామిక్కడ చాలా మ్యాచ్‌లను ఆడినట్టు గుర్తు చేశాడు. అయినా భారత్‌కు ఉండే అనుకూలతపై కాకుండా ఫైనల్‌ను గెలవడంపైనే దృష్టి సారించినట్టు కేన్‌ చెప్పాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2025 | 06:32 AM